గతేడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం.. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతోంది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అందరిది అని.. అందరి బాగోగులు చూస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సూపర్ సిక్స్ పథకాలు, కూటమి మేనిఫెస్టో హామీలపై జరిగిన చర్చకు సీఎం చంద్రబాబు సమాధానం ఇచ్చారు. తమ ప్రభుత్వం ప్రజల వద్దకే వెళ్లి సంక్షేమ పథకాలను అందిస్తోందని తెలిపారు.
అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన హామీలు ఇచ్చి ఎన్నికలకు వెళ్లినట్లు గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్నామని వివరించారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని ఈ సందర్భంగా చంద్రబాబు శాసనసభలో ప్రకటించారు. గత వైసీపీ పాలలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా దెబ్బతిన్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా అక్టోబర్ 4వ తేదీన ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందిస్తామని తేల్చి చెప్పారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవాలని హితవు పలికారు. వచ్చే నెల 4వ తేదీన సాయంత్రం 4 గంటలకు వాహనమిత్ర ద్వారా ఆటో డ్రైవర్ల అకౌంట్లలో రూ.15 వేలు వేయనున్నట్లు తెలిపారు. అయితే దసరా పండగ రోజు (అక్టోబర్ 2 గాంధీ జయంతి)న ఆటోడ్రైవర్ల ఖాతాలో రూ.15 వేలు జమ చేస్తామని గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినా.. తాజాగా దాన్ని నాలుగో తేదీకి మార్చారు. మరోవైపు.. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే కూటమి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద ఈ ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించింది.
మొత్తం 2,90,234 మంది ఆటో డ్రైవర్లకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అర్హుడైన ప్రతి డ్రైవర్ను ఆదుకుంటామని వెల్లడించారు. పెండింగ్ చలాన్లు, ఫిట్నెస్ పత్రాలు క్లియర్ చేసుకున్న వారికే ఆర్థిక సాయం అందిస్తామని స్పష్టం చేశారు. పేదరికమే ప్రామాణికంగా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి పింఛన్లు అందిస్తోందని.. ప్రస్తుతం ఏపీలో 63.5 లక్షల మందికి వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నట్లు చెప్పారు. మొత్తం పింఛన్ లబ్ధిదారుల్లో 59 శాతం మంది మహిళలే ఉన్నారని పేర్కొన్నారు.
స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు అండగా నిలిచామని.. 74 శాతం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించినట్లు చెప్పారు. స్త్రీ శక్తి పథకం అమల్లోకి వచ్చాక బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 69 శాతం నుంచి 90 శాతానికి పెరిగినట్లు చంద్రబాబు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa