ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆధార్ కార్డ్ కొత్త ఛార్జీలు.. అక్టోబర్ 1 నుంచే అమలు

business |  Suryaa Desk  | Published : Sun, Sep 28, 2025, 09:21 PM

ఆధార్ కార్డు ఉన్న వారందరికీ అలర్ట్. ఆధార్‌ కార్డు సంబంధించిన వివిధ సర్వీసులకు ఇకపై అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఆధార్ సేవల యూజర్ ఛార్జీలను పెంచుతూ ఆధార్ కార్డు జారీ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఏఐడీఏఐ) ప్రకటన చేసింది. అయితే, కొత్త ఆధార్ కార్డుల జారీ సర్వీసులు ఉచితంగానే అందిస్తామని తెలిపింది. కానీ, ఇప్పటికే జారీ చేసిన ఆధార్ కార్డుల్లో అడ్రస్ మార్చుకోవడం, నిర్ణీత వయసు వారు వేలి ముద్రలను అప్డేట్ చేయడం వంటి సేవలకు ఛార్జీలు విడతల వారీగా పెంచుతున్నట్లు తెలిపింది. మొదటి విడతలో పెంచిన ఛార్జీలు అక్టోబర్ 1, 2025 నుంచే అమలులోకి తీసుకొస్తున్నారు. మరి ఏ సేవకు ఎంత పెరుగుతుంది అనే వివరాలు తెలుసుకుందాం.


17 ఏళ్ల వయసు దాటిన వారు తమ ఆధార్ కార్డులో వేలి ముద్రలను అప్డేట్ చేసుకోవాలంటే ప్రస్తుతం ఈ సర్వీసులకు రూ.100 వసూలు చేస్తున్నారు. అయితే, దీనిని రూ.125కు పెంచారు. ఇక అడ్రస్ మార్చుకునేందుకు ప్రస్తుతం రూ.50 మేర వసూలు చేస్తుండగా ఈ ఛార్జీలను రూ.75కు పెంచుతున్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచే పెరిగిన ఛార్జీలు అమలులోకి వస్తాయని యూఐడీఏఐ పేర్కొంది. ఈ మేరకు యూఐడీఏఐ హెడ్ ఆఫీసులోని డిప్యూటీ డైరెక్టర్ హిమాన్షు దేశంలోని అన్ని యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయాలకు సమాచారం అందించారు.


కొత్త ఆధార్ ఎన్‌రోల్మెంట్ ఉచితంగానే ఉంటుంది.


చిన్న పిల్లలు 5 సంవత్సరాల నుంచి 7 ఏళ్ల మధ్య వారు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. వారికి సైతం ఈ సేవలు ఉచితంగానే ఉంటాయి.


అలాగే 15 ఏళ్ల నుంచి 17 ఏళ్ల వయసు వారికి సైతం ఎలాంటి ఛార్జీలు ఉండవు.


17 ఏళ్ల వయసు దాటిన వారికి కొత్త ఛార్జీలు వర్తిస్తాయి.


రెండో విడతలో ఈ ఛార్జీలు రూ.100, రూ.125గా నిర్ణయించారు. ఇవి అక్టోబర్ 1, 2028 నుంచి అమలులోకి వస్తాయి.


ఇక మూడో విడతలో సెప్టెంబర్ 30, 2031 నుంచి రూ.90 నుంచి రూ.150గా ఉంటాయని యూఐడీఏఐ తెలిపింది.


మరోవైపు.. 2026, జూన్ 14వ తేదీ వరకు మై ఆధార్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్లో ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఉచితంగా చేసుకోవచ్చని యూఐడీఏఐ తెలిపింది. ఆ తర్వాత ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇక ఆఫ్‌లైన్ ద్వారా ఆధార్ నమోదు కేంద్రాల్లో అయితే ఇప్పుడు కూడా ఛార్జీలు కట్టాలి. అయితే, ఆధార్ కేంద్రాల్లో ఇప్పటికీ రూ.50, రూ.100 పాత ఛార్జీలనే ప్రదర్శిస్తున్నారని తెలుస్తోంది. కొత్త వాటిని అక్టోబర్ 1వ తేదీ తర్వాత ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి. పేరు మార్పు, చిరునామా మార్పు, ఫోన్ నంబర్ మార్పు, బయోమెట్రిక్ అప్డేట్ వంటి వాటికి కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. ఇటీవలే యూఐడీఏఐ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. చిన్న పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ కోసం స్కూళ్లలోనే ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa