విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఇంద్రకీలాద్రికి సతీసమేతంగా చేరుకున్న చంద్రబాబు.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పించి, దుర్గమ్మను దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కొల్లు రవీంద్ర, దుర్గగుడి అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అంతరాలయానికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, గాజులను అందజేశారు.
చంద్రబాబు, భువనేశ్వరి దంపతులకు పండితులు శాస్త్రోక్తంగా వేదాశీర్వచనం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఎనిమిదో రోజు అమ్మవారు జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో బెజవాడ దుర్గమ్మ సరస్వతీ అలంకరణంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఏటా మూలా నక్షత్రం రోజున అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను ముఖ్యమంత్రి సమర్పించడం ఆనవాయితీ. అందుకే ఈ రోజున చంద్రబాబు నాయుడు దంపతులు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు.
ఇక, సరస్వతి అలంకరణలో ఉన్న అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సోమవారం తెల్లవారుజామున 2 గంటల నుంచే దర్శనాలకు భక్తులను అనుమతించారు. దీంతో క్యూలైన్లన్నీ నిండిపోయి.. కొండ దిగువ వినాయక గుడి నుంచి 2 కి.మీ మేర భక్తులు బారులుదీరారు. అలాగే, అమ్మవారి దర్శనం కోసం పలువురు ప్రముఖలు రాకతో ఇంద్రకీలాద్రిపై కోలాహలం నెలకుంది. హోం మంత్రి వంగలపూడి అనిత, గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణరాజు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), టీడీపీ ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్బాబు, చింతమనేని ప్రభాకర్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
కాగా, ఈ ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాలు 11 రోజుల పాటు జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 2న విజయ దశమి రోజున జగన్మాత రాజరాజేశ్వరి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆ రోజు సాయంత్రం తెప్పోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa