ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో కేవలం రూ.10లకే టీ, వాటర్ బాటిల్.. రూ.20

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 29, 2025, 07:10 PM

విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఉడాన్‌ యాత్రీ కేఫ్‌ అందుబాటులోకి వచ్చింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు సోమవారం (సెప్టెంబరు 29న) ఈ కేఫ్‌ను ప్రారంభించారు. విమానాశ్రయాల్లో ఆహారం, వాటర్ బాటిల్, కూల్ డ్రింకులు కేవలం రూ.10 నుంచి అందుబాటులో ఉంటాయని, తద్వారా ప్రతి ప్రయాణికుడికి అదనపు ప్రయోజనాన్ని అందజేన్నామని ఆయన చెప్పారు. కేఫ్ ప్రారంభించిన అనంతరం ప్రయాణికులతో కేంద్రమంత్రి ముచ్చటించి, వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు.


‘‘పదేళ్ల క్రితం దేశంలో 74 ఎయిర్‌పోర్టులు మాత్రమే ఉండేవి.. కానీ ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న దృఢమైన నిర్ణయాలు, సుదూర పట్టణాలను అనుసంధానించే ప్రణాళికలతో ఇప్పుడు 160 విమానాశ్రయాలు పని చేస్తున్నాయి. దీంతో చిన్న పట్టణాలకూ విమాన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. సామాన్యులు కూడా తక్కువ ఖర్చుతో విమానాల్లో ప్రయాణించే స్థితికి చేరుకున్నాం” అని కేంద్ర మంత్రి అన్నారు.


ప్రయాణికులకు తక్కువ ధరల్లో నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ఉడాన్ యాత్రి కేఫే ఒక కొత్త కాన్సెప్ట్. దీన్ని దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టులన్నింటికి విస్తరించాలనే ఆలోచనతో మేము ముందుకు సాగుతున్నాం” అని చెప్పారు.


ఆ తర్వాత ‘అమ్మ పేరుతో ఒక చెట్టు’ కార్యక్రమంలో భాగంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఆవరణలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో రామ్మోహన్‌నాయుడు పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని (శివనాథ్‌), ఎయిర్‌పోర్ట్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, ఉడాన్ యాత్రి కేఫ్‌ను దేశంలో తొలిసారి కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 2024 డిసెంబరు 19న ప్రారంభించారు. తర్వాత చైన్నై, అహ్మదాబాద్, పుణే, భువనేశ్వర్, వంటి విమానాశ్రయాల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు.


విమాన ప్రయాణాన్ని మరింత సులభతరం, అందుబాటులో ఉండేలా, అందరికీ చేరువ చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న పథకం ఇది. కోల్‌కతా విమానాశ్రయంలో ఈ కేఫ్‌లు విజయవంతం కావడంతో ఇతర విమానాశ్రయాల్లో కూడా ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో క్రమంగా దేశంలోని విమానాశ్రయాల్లో వీటిని ఏర్పాటుచేస్తోంది కేంద్ర ప్రభుత్వం.


ఇక, ఉడాన్ యాత్రి కేఫ్ అంటే సామాన్య పౌరులకు విమాన ప్రయాణం చేరువచేయడం అనే లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ పథకం విమాన ప్రయాణాన్ని సామాన్యులకు చేరువ చేయడం, విమానాశ్రయ మౌలిక వసతులను ఆధునీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఉడాన్ యాత్రి కేఫ్‌లో వాటర్ బాటిల్, టీ రూ.10 లకు, కాఫీ, సమోసా రూ.20, స్వీటు రూ.20 లకు విక్రయిస్తారు. దీని వల్ల ప్రయాణికులకు ఖర్చు తగ్గుతుంది. మార్కెట్ ధరలకే ఆహారం, పానీయాలు వారికి అందుబాటులో ఉంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa