ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ లిక్కర్ కేసులో.. ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 29, 2025, 07:14 PM

ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో అరెస్టైన రాజంపేట ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత మిథున్ రెడ్డికి ఊరట లభించింది. మద్యం కేసులో ఏ4గా ఉన్న మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షల ష్యూరిటీ, వారానికి రెండుసార్లు సంతకం సహా షరతులతో కూడిన బెయిల్‌ను ఇచ్చింది. లిక్కర్ కేసులో అరెస్టైన మిథున్ రెడ్డి .. 71 రోజులుగా జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం ఆయన పలుసార్లు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. అయితే, సెప్టెంబరు 9న జరిగిన ఉప-రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటువేయడానికి మిథున్ రెడ్డికి నాలుగు రోజుల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పూర్తిస్థాయి బెయిల్ మంజూరు కావడంతో మిథున్ రెడ్డి.. మంగళవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.


పాక్ మంత్రి చేతుల మీదుగా ఆసియా కప్‌ ట్రోఫీ తిరస్కరించిన భారత్.. పహల్గామ్ ఉగ్రదాడి బాధితుడి తండ్రి కీలక వ్యాఖ్యలు


ఈ ఏడాది జులై 19న సిట్ అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. తాజాగా, మిథున్‌ రెడ్డి బెయిల్ రావడంతో ఇప్పటి వరకూ ఈ కేసులో ఐదుగురికి బెయిల్ వచ్చినట్టయ్యింది. జులై 19న మిథున్ రెడ్డిని విచారణకు పిలిచిన సిట్ అధికారులు.. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకూ ప్రశ్నించారు. కానీ, మిథున్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని పేర్కొంటూ సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా.. హైదరాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో భారీగా నగదు పట్టుబడిన సంగతి తెలిసిందే.


ఈ కేసులో ఏ31 ధనుంజయ రెడ్డి, ఏ32 కృష్ణ మోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్పలకు సెప్టెంబరు మొదటివారంలోనే బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే, వారి విడుదల సందర్భంగా హైడ్రామా చోటుచేసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం హాయంలో జరిగిన మద్యం పాలసీ వ్యవహారంలో మొత్తం రూ.3,500 కోట్లు మేర అక్రమాలు జరిగినట్టు సిట్ నిర్దారించింది. ఇందులో ఏ1గా రాజ్‌ కేసిరెడ్డి ఉండగా.. మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం జైల్లోనే ఉన్నారు. వారు ఇరువురూ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అనారోగ్య కారణాలతో బెయిల్ కోసం వారు ఇరువురూ పెట్టుకున్న పిటిషన్లను ఏసీబీ కోర్టు తాజాగా తిరస్కరించింది. ఈ కేసులో ఆయన ఏ38గా ఉండగా.. జూన్‌ నెలలోనే సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, లిక్కర్ కేసులో పరారీలో ఉన్న నిందితులకు నాన్‌- బెయిలబుల్‌ అరెస్టు వారెంట్లకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa