ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మమ్మల్ని ఇబ్బంది పెట్టే వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు, గుర్తుపెట్టుకోండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 30, 2025, 06:04 PM

కూటమి పాలనలో అన్యాయానికి గురైన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, సామాన్య ప్రజల కోసం పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి డిజిటల్‌ బుక్‌ లాంచ్‌ చేశారని మాజీ మంత్రి ఆర్కేరోజా స్పష్టం చేశారు. ఇన్నాళ్లు రెడ్‌బుక్ అరాచ‌కాలు చూశామ‌ని, వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక డిజిట‌ల్ బుక్ ఏంటో చూపిస్తామ‌ని కూట‌మి నేత‌ల‌ను హెచ్చ‌రించారు. సోమ‌వారం న‌గ‌రిలోని తన నివాసం వైయస్‌ఆర్‌సీపీ డిజిటల్‌ బుక్‌ క్యూర్‌ కోడ్‌ పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  రోజా మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టే వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని, పార్టీ అధినేత, జగనన్న అండగా ఉంటారని పార్టీ శ్రేణులకు భరోసా కల్పించారు.  ప్రజాప్రభుత్వం అంటే సంక్షేమం, అభివృద్ధిని పరిగణలోకి తీసుకోవాలి కానీ దురదృష్టవశాత్తు ఏపీలో చంద్రబాబు కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 15 నెలలుగా అరాచక పాలన సాగుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైయస్‌ఆర్‌సీపీ హయాంలో పనిచేసిన అధికారులపై అక్రమ కేసులు పెడుతూ అనాగరికంగా వ్యవహరిస్తున్నారన్నారు. సోషల్‌ మీడియా వారిని వదిలిపెట్టడం లేదని వారిపై కూడా అక్రమ కేసు పెడుతున్నారన్నారు. ఎప్పటికప్పుడు కోర్టులు అక్షింతలు వేస్తున్నా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదన్నారు. వైయస్‌ఆర్‌సీపీలో ఇకపై కార్యకర్తలకే పెద్దపీట ఉంటుందని కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న అధికారులపై భవిష్యత్‌లో చర్యలు ఖాయమన్నారు. ఎక్కడున్నా వారిని చట్టం ముందు నిలబెడతామన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా ‘డిజిటల్‌ బుక్‌’లో నమోదు చేయవచ్చన్నారు.  ‘‘డీబీ.డబ్ల్యూఈవైయస్‌ఆర్‌సీపీ.కామ్‌’’ అనే వెబ్‌సైట్‌లో గానీ, 040–49171718 నంబర్‌కు కాల్‌ చేసి గానీ ఫిర్యాదు చేయవచ్చన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే అందరిపై చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. ప్రజాసంక్షేమాన్ని విస్మరించి కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ లీగల్‌ సెల్‌ ప్రధానకార్యదర్శి రవీంద్ర, నగరి, పుత్తూరు మున్సిపల్‌ చైర్మన్లు నీలమేఘం, హరి, వైస్‌ చైర్మన్లు జయప్రకాష్, శంకర్, బాలన్, జడ్పీటీసీ పరంధామన్, నిండ్ర, విజయపురం ఎంపీపీలు లత, మంజుబాలాజి, భార్గవి, నగరి, పుత్తూరు, నిండ్ర, విజయపురం, వడమాలపేటకు చెందిన మున్సిపల్, మండల అధ్యక్షులు రమేష్‌రెడ్డి, తిరుమలరెడ్డి, ఏకాంబరం, వేణురాజు, శివరాజు,  సుబ్రమణ్యం రెడ్డి, జిల్లా, మండల పార్టీ కమిటీ, అనుబంధ కమిటీ నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa