ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇక శబరిమల వెళ్లకుండానే, ఇంటి వద్దకే ప్రసాదం డెలివరీ

national |  Suryaa Desk  | Published : Tue, Sep 30, 2025, 08:24 PM

శబరిమలలో మరికొన్ని రోజుల్లో మండల పూజలు, మకరవిళక్కు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. భక్తుల కోసం ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు కీలక చర్యలు చేపట్టింది. శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలె ఆలయ ద్వారాలకు ఉండే విగ్రహాలకు బంగారు పూతకు మెరుగు పెట్టించిన ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు.. తాజాగా సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇక నుంచి అయ్యప్ప భక్తులు స్వామివారి ప్రసాదాలను.. ఆలయానికి వెళ్లకుండా.. తమ ఇంట్లో నుంచే ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకునే సౌకర్యాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ సౌకర్యం మరో నెల రోజుల్లో అమలులోకి వస్తుందని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది. .


ఈ ఆన్‌లైన్ బుకింగ్ కోసం ప్రత్యేకంగా కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ ద్వారా ప్రారంభించింది. శబరిమలతో పాటు.. ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు పరిధిలో ఉన్న మొత్తం 1252 దేవాలయాల ప్రసాదాలను కూడా భక్తులు ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకునే అవకాశాన్ని ఈ కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ ద్వారా కల్పించనున్నారు. శబరిమల ప్రసాదం అంటే ఇష్టపడని వారు ఉండరు. అయితే శబరిమల వెళ్లాలంటే అత్యంత రద్దీ ఉంటుంది.


పైగా శబరిమలలో మహిళలు ప్రవేశించడంపై నిషేధం విధించారు. అలాంటి ఆలయాలకు వివిధ కారణాల వల్ల నేరుగా వచ్చి దర్శనం చేసుకోలేని లక్షలాది మంది భక్తుల కోసం ఈ సదుపాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. ఈ కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ ఒక నెలలోపే పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తుందని బోర్డు అధ్యక్షుడు వెల్లడించారు.


మరోవైపు.. ఈ ఆన్‌లైన్ ప్రసాద బుకింగ్ సదుపాయంతో పాటు శబరిమలలోని ఇతర పరిపాలనా అంశాలపైనా టీడీబీ ఇటీవల దృష్టి సారించింది. శబరిమల ఆలయంలోని బంగారం, వెండి, విలువైన రాళ్లు వంటి ఆభరణాలు, వస్తువులకు సంబంధించిన నిర్వహణ రిజిస్టర్లలో లోపాలు ఉన్నాయని గుర్తించిన కేరళ హైకోర్టు .. ఇటీవలె ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.


ఆలయ ద్వారపాలక విగ్రహాల బంగారు పూతను వేసేందుకు తీసుకెళ్లి.. మళ్లీ తీసుకురాగా.. అందులో 4 కిలోలకు పైగా బంగారం తగ్గినట్లు నివేదికలు రావడంతో కేరళ హైకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకుంది. దేవాలయ ఆస్తులను దుర్వినియోగం కాకుండా కాపాడేందుకు.. ఆలయానికి సంబంధించిన అన్ని విలువైన వస్తువుల కచ్చితమైన, డిజిటలైజ్డ్ లిస్ట్‌ను తయారుచేయాలని ఆదేశించింది.


ఇందుకోసం రిటైర్డ్ జడ్జి కె.టి. శంకరన్‌ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. దేవాలయంలోని విలువైన ఆస్తుల నిర్వహణలో ఉన్న లోపాలను, అవకతవకలను గుర్తించి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ విభాగాన్ని హైకోర్టు ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa