బీహార్లో తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 30వ తేదీ అంటే ఈరోజే విడుదల చేయనున్నారు. ఈ జాబితా విడుదలైన వెంటనే.. రాబోయే వారం రోజుల్లో ఎన్నికల సంఘం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 22 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత బీహార్లో ఓటర్ల జాబితా సవరణ జరిగింది. అయితే 'ఎస్ఐఆర్' అని పిలిచే ఈ సవరణ ప్రక్రియ ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ ప్రక్రియ వల్ల కోట్లాది మంది నిజమైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం (ఈసీ) ఖండించింది. ఏ అర్హతగల పౌరుడినీ ఓటర్ల జాబితా నుంచి తప్పించబోమని, అలాగే ఏ అనర్హుడినీ జాబితాలో చేర్చబోమని స్పష్టం చేసింది.
ఈ వివాదంపై సుప్రీం కోర్టులో విచారణ కూడా జరుగుతోంది. జాబితా సవరణ ప్రక్రియ వల్ల పెద్ద ఎత్తున ఓటర్లకు ఓటు హక్కు లేకుండా పోతుందని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 7వ తేదీన జరగనుంది. ఈ అంశంపై కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ స్పందిస్తూ.. "ఓటర్ జాబితా తుది నివేదిక ఈరోజే విడుదల అవుతుంది. ఇప్పుడు ప్రతిపక్షాలు ఎంత రాజకీయం చేస్తాయో చూడాలి. ఏదైనా మంచి జరిగినా, ఫిర్యాదు వచ్చినా దానికి ఎన్నికల సంఘం పూర్తి బాధ్యత వహిస్తుంది" అని అన్నారు.
తుది జాబితా ఈరోజే విడుదల అయితే.. వచ్చే వారంలోనే ఈసీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల సన్నాహాలను పరిశీలించడానికి ఈసీ నుంచి ఒక బృందం అక్టోబర్ 4, 5 తేదీలలో పాట్నాలో పర్యటించనుంది. నవంబర్ చివరి వారంలో జరిగే ఛట్ పూజ తర్వాత మొదటి దశ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల కోసం ఈసీ 470 మంది పరిశీలకులను నియమిస్తోంది. సాధారణ, పోలీస్, వ్యయ పరిశీలకుల బృందానికి అక్టోబర్ 3న అక్కడ ఒక బ్రీఫింగ్ కూడా నిర్వహించనున్నారు.
243 మంది సభ్యులు ఉన్న బీహార్ అసెంబ్లీ పదవీ కాలం నవంబర్ 22న ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈసీ ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలు కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో మూడు దశల్లో జరిగాయి. ఇప్పుడు సాధారణ పరిస్థితుల్లో ఎన్నికలు జరగనుండటంతో ప్రజల భాగస్వామ్యంపై ఉత్కంఠ నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa