ప్రాణానికి ఎవరూ వెల కట్టలేరు. కోట్లు ఖర్చు చేసినా పోయిన ప్రాణం తిరిగిరాదు. అయితే ఈ ఆధునిక ప్రపంచంలో ప్రాణానికి విలువ లేకుండా పోతోంది! చిన్న చిన్న కారణాలతో హత్య చేసేందుకు కూడా వెనుకాడటం లేదు చాలా మంది. కన్న తల్లిదండ్రులు, పిల్లలు.. కట్టుకున్న భార్య, భర్తలను కూడా కడతేర్చేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని క్షణాలు ప్రశాంతంగా ఆలోచించే సహనం లేకుండా.. నిండు ప్రాణాలను బలిగొంటున్నారు. చిన్న విషయాలకే కోపం తెచ్చుకుని.. విచక్షణ కోల్పోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ట్యాబ్లెట్లు వేసుకోవడం లేదని కోపోద్రిక్తురాలైన ఓ కూతురు.. అతి కిరాతకంగా కన్న తల్లిన కొట్టి చంపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 82 ఏళ్ల వయసున్న తల్లి లక్ష్మి ఎస్ఆర్ నగర్లోని కుమార్తె మాధవి (42) వద్ద ఉంటోంది. సోమవారం రాత్రి తల్లి ట్యాబ్లెట్లు వేసుకోకపోవడంతో మాధవి కోపోద్రిక్తురాలైంది. ఈ విషయంపై రాత్రి గొడవ జరిగింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన మాధవి ఇనుప రాడ్డుతో లక్ష్మిపై దాడి చేసింది. దీంతో వృద్ధురాలు చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం కుమార్తె మాధవిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే తల్లికూతుళ్లిద్దరికీ మతిస్థిమితం లేదని, మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇంతకుముందు ఇలాంటి మరో ఘటన హైదరాబాద్లో జరిగింది. జూన్లో జీడిమెట్ల ప్రాంతంలో ఓ 16 ఏళ్ల అమ్మాయి కన్న తల్లిని హతమార్చింది. ప్రేమకు అడ్డుచెప్పిందని ప్రియుడు, సోదరుడితో కలిసి పక్కా పథకం ప్రకారం చున్నీతో ఊపిరాడకుండా చేసి చంపేసింది. తల్లి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా కనికరం చూపించలేదు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇదే కాకుండా జూలైలో తన వివాహేతర బంధానికి అడొస్తున్నాడని కన్నతండ్రిని కడతేర్చింది ఓ కూతురు. ప్రియుడు, తల్లితో కలిసి అతి కిరాతకంగా హత్య చేసింది. చంపేసి గుండెలేని బండరాయిలా సెకండ్ షో సినిమాకు వెళ్లొచ్చింది. ఆ తర్వాత తండ్రి శవాన్ని క్యాబ్లో తీసుకెళ్లి ఓ చెరువులో పడేసింది.
ఈ మధ్య కాలంలో మనుషుల్లో నేర ప్రవృత్తి పెరగడానికి పలు కారణాలున్నాయి. నిపుణుల ప్రకారం.. మానసిక సస్యలతో బాధపడుతున్న వారిలో అసహనం, కోపం, డిప్రెషన్ ఎక్కువై నేరాలకు పాల్పడుతున్నారు. కుటుంబ సంబంధాలు బలహీనపడటం, సామాజిక విలువలు తగ్గడం.. వీడియో గేమ్స్, సినిమాలు హింస, ప్రతీకారం, నేర ప్రవర్తనను చూపించడం కూడా మనుషుల్లో నేర ప్రవృత్తి పెరగడానికి దారితీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa