పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో అంతర్యుద్ధం కొనసాగుతోంది. ప్రత్యేక బలూచిస్తాన్ దేశంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న సంస్థలకు, పాకిస్తాన్ ప్రభుత్వానికి మధ్య తీవ్ర యుద్ధం నెలకొంది. బలూచిస్తాన్ ప్రావిన్స్పై పాక్ సైన్యం నాన్స్టాప్గా దాడులు చేస్తోంది. ఖుజ్దార్ జిల్లా జెహ్రీ ప్రాంతంలో పాకిస్తాన్ సైనిక కార్యకలాపాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. పాకిస్థానీ మిలిటరీ చేపట్టిన ఈ ఆపరేషన్ నేటితో నాలుగో రోజుకు చేరుకుంది. బలూచిస్తాన్ పోస్ట్ నివేదికల ప్రకారం.. ఈ ప్రాంతంలో పాక్ సైన్యం డ్రోన్ దాడులు, నిరంతర ఫిరంగులు, మోర్టార్ ఫైర్ షెల్లింగ్కు పాల్పడుతోంది.
ఆగస్ట్ నెలలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ), బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) వంటి బలూచిస్తాన్ స్వాతంత్ర్య అనుకూల సాయుధ సమూహాలు జెహ్రీ ప్రాంతంపై పట్టు సాధించాయి. దీంతో ఆ ప్రాంతాన్ని తిరిగి తమ ఆధీనంలోకి తీసుకోవడానికే పాక్ సైన్యం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే జెహ్రీ భారీ దాడులు చేపట్టింది. ఈ ఆపరేషన్లో వైమానిక డ్రోన్లు, సాయుధ వాహనాలు, భారీ ఫిరంగిదళాలను పాక్ సైన్యం ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.
సైనిక ఆపరేషన్ కారణంగా జెహ్రీ ప్రాంతంలో తీవ్ర మానవతా సంక్షోభం ఏర్పడిందని స్థానిక మీడియా వెల్లడిస్తోంది. ఆ ఆపరేషన్ ప్రారంభించినప్పటి నుంచి జెహ్రీ ప్రాంతంలో కమ్యూనికేషన్ లైన్లు, ఇంటర్నెట్ను పూర్తిగా నిలిపేసింది. రోడ్లను కూడా మూసివేయడంతో.. నష్టం, పౌర మరణాలకు సంబంధించిన వివరాలను స్వతంత్రంగా ధృవీకరించడం సాధ్యపడటం లేదు. 3 రోజుల పాటు పూర్తి స్థాయిలో విధించిన లాక్డౌన్ కారణంగా ఇంధనం (పెట్రోల్), ఆహార కొరత తీవ్రమైంది. నిత్యావసరాల కోసం బలూచ్ ప్రజలు తీవ్రంగా అల్లాడుతున్నారు.
కోచవ్ గ్రామంలో పాకిస్తానీ దళాల నిరంతర బాంబు దాడుల వల్ల పత్తి పంటలు పూర్తిగా ధ్వంసమై, స్థానిక రైతులు ఆర్థికంగా భారీ నష్టాన్ని చవిచూశారు. చష్మా, దందర్, మోరెంకి వంటి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా భారీ షెల్లింగ్ కారణంగా ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అనేక నివాస భవనాలు దెబ్బతిన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. జెహ్రీ ప్రాంతంలో కమ్యూనికేషన్ వ్యవస్థను పూర్తిగా నిలిపివేయడం, సహాయక చర్యలకు అడ్డంకులు ఏర్పడటం వల్ల, సామాన్య పౌరులపై తీవ్ర ప్రభావం పడుతోంది. బలూచిస్తాన్లో నిరంతరం కొనసాగుతున్న ఈ ఘర్షణల వేళ.. ఈ ఆపరేషన్ మరింత అశాంతిని పెంచుతుందని బలూచిస్తాన్ పోస్ట్ నివేదించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa