ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. 31 మంది మృతి

international |  Suryaa Desk  | Published : Wed, Oct 01, 2025, 10:37 PM

ఈ సంవత్సరం ప్రపంచదేశాలను వరుస ప్రకృతి విపత్తులు వెంటాడుతున్నాయి. మరీ ముఖ్యంగా పలు దేశాలు భూకంపధాటికి కుప్ప కూలుతున్నాయి. ఈ సంవత్సరం మయన్మార్, బ్యాంకాక్ ప్రాంతాల్లో సంభవించిన భూకంపాలు ఎంతటి నష్టాన్ని మిగిల్చాయో చూశాము. తాజాగా ఫిలిప్పీన్స్‌ను భూకంపం కుదిపేసింది. 6.9 తీవ్రతతో సంభవించిన భూకపం ధాటికి సుమారు 31 మంది చనిపోయారని.. పలువురు గాయపడ్డారని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు.


మంగళవారం సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో 6.9 తీవ్రతతో (రిక్టర్ స్కేలుపై) భారీ భూకంపం సంభవించింది. వార్తా ఏజెన్సీల ప్రకారం.. ఈ భూకంపం వల్ల వేర్వేరు ప్రాంతాల్లో దాదాపు 31 మంది చనిపోయారని సమాచారం. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. సెబు ప్రాంతంలోని బోగో నగరానికి 17 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో అత్యధికంగా 14 మంది వరకు చనిపోయి ఉంటారని తెలుస్తోంది. భూకంప ధాటికి అనేక ఇళ్లు, బిల్డింగులు కుప్ప కూలాయి.


అలానే పర్వత ప్రాంతాల్లోని నివాసాల మీద కొండ చరియలు విరిగి పడి ఇళ్లు కుప్ప కూలాయి. భూకంపం నేపథ్యంలో ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ముందుగా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకుంది. భూకంత తీవ్రత వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ భారీ ప్రకంపనల వల్ల ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. కనీసం 22 భవనాలు దెబ్బతిన్నాయి. వాటిలోఒక పురాతన రాతి చర్చి కూడా ఉంది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.


అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం, భూకంప కేంద్రం బోహోల్ ప్రావిన్స్‌లోని కలపేకు తూర్పు-ఆగ్నేయంగా సుమారు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిపింది. కలపేలో దాదాపు 33,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. భూకంపం వల్ల వారంతా తీవ్రంగా ఆందోళన పడుతున్నారు. అలానే స్థానిక అధికారులు భూకంపం వల్ల సముద్రంలో చిన్న అలజడి చెలరేగే అవకాశం ఉన్నందున.. సెబు, బిలిరాన్ అనే మధ్య దీవుల ప్రజలు బీచ్‌లకు దూరంగా ఉండాలని, తీరానికి వెళ్లవద్దని కోరింది.


భూకంపం వల్ల కొన్ని ప్రాంతాల్లో కరెంట్ సరఫరా, కమ్యూనికేషన్ నిలిచిపోయాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఫిలిప్పీన్స్ పసిఫిక్ మహాసముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్‌పై ఉన్నందున ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. అయితే వీటిల్లో ఎక్కువ శాతం భూకంపాలు తక్కువ తీవ్రతను కలిగి ఉండటంతో.. ఇక్కడి ప్రజలు తట్టుకోగలుగుతున్నారు. ప్రస్తుత భూకంపం వలన సంభవించిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడికాలేదు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa