మింగ మెతుకు లేదు కానీ.. మీసాలకు సంపెంగ నూనె కావాలన్నట్లు ఉంది.. పాకిస్థాన్ తీరు చూస్తుంటే. ఓవైపు తినడానికి తిండి లేకుండా దేశంలో అనేక మంది ప్రజలు అల్లాడిపోతుంటే.. మరోవైపు 70 ఏళ్లుగా కనీస హక్కులు లేకుండా అణచివేస్తున్నారని పాక్ ఆక్రమిత ప్రాంతంలోని పౌరులు పాకిస్థాన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. తన పరిస్థితినే చక్కదిద్దుకోలేక పోతున్న పాక్.. విదేశాల అండతో భారత్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఆ వక్రబుద్ధి పాకిస్థాన్కు తాజాగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సర్ క్రీక్ ప్రాంతంలో దాయాది సైనిక కార్యకలాపాలను ప్రస్తావించిన మంత్రి.. పాక్ పిచ్చి వేశాలేస్తే ఫలితం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. చరిత్రతో పాటు భౌగోళిక పరిస్థితులు మారిపోవచ్చని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాజ్నాథ్ మాట్లాడారు.
పాకిస్థాన్ చేస్తున్న కార్యకలాపాలను భారత్ జాగ్రత్తగా గమనిస్తోందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ముఖ్యంగా సర్క్రీక్ ప్రాంతంలో మిలిటరీ జోన్ల విస్తరణపై ఫోకస్ పెట్టినట్లు వెల్లడించారు. గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్లోని 96 కిలోమీటర్ల పొడవైన చిత్తడి నేల అయిన సర్ క్రీక్ రీజియన్.. దశాబ్దాలుగా భారత్, పాక్ మధ్య వివాదాస్పద ప్రాంతంగా ఉంది.
సర్ క్రీక్ విషయంలో సుదీర్ఘకాలంగా ఉన్న వివాదాన్ని పాక్ కావాలనే రెచ్చగొడుతుందని రక్షణ మంత్రి అన్నారు. చర్చల ద్వారా ఆ వివాదాన్ని పరిష్కరించేందుకు భారత్ ఎన్నో ప్రయత్నాలు చేసిందన్నారు. అయితే ఇటీవల ఆ ప్రాంతం సమీపంలో పాకిస్థాన్ మిలిటరీ జోన్ల విస్తరణ.. ఆ దేశ ఉద్దేశాలను తెలియజేస్తోందన్నారు. ఎలాంటి దాడినైనా తిప్పికొట్టేందుకు.. సరిహద్దు వెంబడి ఇండియన్ ఆర్మీ, బీఎస్ఎఫ్ అత్యంత అప్రమత్తతతో ఉన్నాయని రాజ్నాథ్ తెలిపారు.
భారత్ పైకి పాకిస్థాన్ ఏవైనా కుట్రలు పన్నితే.. దాని ప్రతిస్పందన ఊహించలేనివిధంగా ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 1965 యుద్ధ సమయంలో కూడా భారత బలగాలు లాహోర్కు వెళ్లగలిగే సత్తా కలిగిఉన్నాయని.. ఇప్పుడిది 2025 అని.. సర్ క్రీక్ నుంచి కరాచీకి డైరెక్ట్ రూట్ ఉందని.. పాక్ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని రాజ్నాథ్ సింగ్ చురకలు అంటించారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా భారత రక్షణ వ్యవస్థలను ఛేదించడానికి పాకిస్థాన్ విఫలయత్నం చేసిందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. లేహ్ నుంచి సర్ క్రీక్ వరకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేసిందన్నారు. అయితే దానికి ప్రతీకారంగా భారత్ సైన్యం.. పాక్ గగనతల రక్షణ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసి గట్టి సందేశం ఇచ్చిందని చెప్పారు. వారు కావాలనుకున్నప్పుడు.. ఇండియన్ ఆర్మీ.. వారికి ఊహించని నష్టాన్ని కలిగిస్తుందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa