అరుణాచలం సమీపంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన యువతిపై పోలీసుల సామూహిక అత్యాచార ఘటనను తమిళనాడు ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు సుందర్, సురేశ్ రాజ్లను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను ఎంకే స్టాలిన్ ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. పోలీసులే అత్యాచారానికి తెగబడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమిళనాడులో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఎడిప్పాడి పళనిసామి స్పందిస్తూ.. సోదరిపై పోలీసులు అత్యాచార ఘటన సభ్యసమాజానికి సిగ్గుచేటని మండిపడ్డారు.
ఈ పరిణామాల నేపథ్యంలో డీఎంకే ప్రభుత్వం.. కానిస్టేబుళ్లను విధుల నుంచి తప్పించింది. సోమవారం (సెప్టెంబరు 29న) రాత్రి తమిళనాడులోని ఎంథాల్ బైపాస్ వద్ద గస్తీలో ఉన్న పోలీస్ కానిస్టేబుళ్లు సురేశ్, సుందర్లు.. టమాటాలు లోడుతో వెళ్తున్న ట్రక్కును ఆపి తనిఖీలు చేశారు. ఈ సమయంలో వాహనంలో ఉన్న ఇద్దరు మహిళలను వారు గమనించారు. అనుమానం ఉందని, కిందకు దిగాలని ఆదేశించారు. కానీ, వారు దిగపోయేసరికి కొట్టి బలవంతంగా కిందకు దింపేశారు. దీంతో భయపడిపోయిన ట్రక్కు డ్రైవర్ ఆ ఇద్దరు తల్లీకూతుళ్లను వదిలేసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
తర్వాత వారి ఇద్దర్నీ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తామని చెప్పి, కానిస్టేబుళ్లు జీపు ఎక్కించారు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత ఓ గోతి తల్లిని తోసేసిన కామాంధులు.. యువతిని పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. సెప్టెంబరు 30న తెల్లవారుజామున 4 గంటల సమయంలో స్థానికులు ఆ యువతిని గుర్తించి, అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న తిరువన్నామలై ఎస్పీ సుధాకర్, ఇతర అధికారులు ఆసుపత్రిలోని బాధితురాలిని పరామర్శించారు. ఆమె చెప్పిన వివరాలు ఆధారంగా నిందితులను సుందర్, సురేశ్ రాజ్లుగా గుర్తించారు. ఇరువురిపై అత్యాచారం తదితర సెక్షన్ల కింద కేసు నమోదుచేసి, నిందితులను అదే రోజు అరెస్ట్ చేశారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే ఇంతటి దారుణానికి పాల్పడటంతో సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa