ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, అప్రమత్తమైన అధికారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 02, 2025, 05:03 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి భారీ వర్ష సూచన జారీ అయ్యింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విశాఖకు 300 కి.మీ. దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతం అయిందని తెలిపింది. ఇవాళ రాత్రికి గోపాల్‌పూర్‌-పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఉత్తర కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే విశాఖలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో.. పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల చెట్లు, హోర్డింగ్స్‌ నేలకొరిగాయి. రహదారులు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలిపిస్తున్నాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్ష కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. GVMC కార్యాలయం, చినవాల్తేరు, ఈస్ట్‌పాయింట్‌ కాలనీలో చెట్లు కూలినట్లు సమాచారం. ఈ మేరకు వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఏదైనా సమస్య తలెత్తితే.. విశాఖ కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌: 0891 2590 100, 0891 2590 102 ఫోన్ చేయాలని అధికారులు కోరారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa