ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తేడా జరిగితే మ్యాప్ నుంచి లేపేస్తాం.. నిన్న రాజ్‌నాథ్, నేడు ఆర్మీ చీఫ్ వార్నింగ్

national |  Suryaa Desk  | Published : Fri, Oct 03, 2025, 07:59 PM

విజయదశమి నాడు పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. భారత్‌పైకి ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా.. పాక్ భౌగోళిక స్థితి మారుతుందని అన్నారు. గుజరాత్ నుంచి కరాచీ దారి ఉందనే విషయం మర్చిపోవద్దని హితవు పలికారు. శుక్రవారం (ఆక్టోబర్ 3) మరోసారి పాకిస్థాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ. పాక్.. దేశ ఎజెండాగా ఎగదోస్తున్న ఉగ్రవాదాన్ని ఆపకపోతే.. ఈసారి తాము సంయమనం పాటించేది లేదని తేల్చిచెప్పారు. మ్యాప్ నుంచి పాకిస్థాన్‌ను తుడిచేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు.


"ఈసారి ఆపరేషన్ సిందూర్ 1.0లో లాగా సంయమనాన్ని పాటించము. పాకిస్థాన్ తన భౌగోళిక రూపాన్ని కాపాడుకోవాలనుకుంటుందా లేదా అని ఆలోచించుకునేటట్లు ఈసారి చేస్తాం. పాకిస్తాన్ భౌగోళికంగా ఇప్పుడెలా ఉందో అలాగే ఉండాలనుకుంటే.. తాము భారత్‌పైకి ఎగదోస్తున్న ఉగ్రవాదాన్ని ఆపాలి" అని జనరల్ ద్వివేది అన్నారు.


సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్థాన్ మిలిటరీ జోన్లను విస్తరిస్తూ భారత్‌పై కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఈ నేపథ్యంలోనే రాజ్‌నాత్ సింగ్ పాక్‌ను హెచ్చరించారు. పాకిస్థాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడితే.. గుజరాత్‌ నుంచి కరాచీ దారి ఉందని.. ఆ ప్రాంతం మొత్తం ధ్వంసమవుతుందనే అర్థంలో ఆయన మాట్లాడారు. భారత్ ఈసారి గట్టిగా ప్రతిస్పందిస్తుందని తెలిపారు.


పాకిస్థాన్ 'తీపి కథలు'..


భారత యుద్ధ విమానాలను కూల్చేసినట్లు పాకిస్థాన్ చేస్తున్న ప్రకటనను శుక్రవారం ఉదయం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఖండించారు. అవి పాకిస్థాన్ 'తీపి కథలు' (మనోహర్ కహానియన్) అంటూ కొట్టపారేశారు. "మన 15 యుద్ధ విమానాల కూల్చివేశారని వారు (పాకిస్థాన్) నమ్ముతున్నారు. వారిని అలాగే నమ్మనివ్వండి. వారు అలా అనుకోవడం మనకు కూడా మంచిదే. వారు సరోసారి మనతో పోరాడినప్పుడు.. మన వద్ద 15 విమానాలు తక్కువ ఉంటాయని వారు ఆశిస్తారు. కాబట్టి నిజంగా ఏమి జరిగిందో లేదా ఎంత నష్టం జరిగిందో నేను ఏమీ చెప్పను. వారే స్వయంగా కనుగొననివ్వండి." అని అన్నారు.


పాకిస్థాన్‌కు ఇక గడ్డుకాలమే..!


సర్ క్రీక్ ప్రాంతంలో మిలిటరీ జోన్ల విస్తరణ, జమ్మూకాశ్మీర్ సరిహద్దు వెంబడి చొరబాట్లకు ఉగ్రవాదులను లాంచ్ ప్యాడ్‌లలో సిద్ధంగా ఉంచడం., అమెరికా సహాయం చేస్తుండం.. అన్నిటీకి కనెక్షన్ ఉన్నట్లు అర్థమవుతోంది. భారత్‌ను రెచ్చగొట్టేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు చేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజానాథ్‌ సింగ్, ఆర్మీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా పాకిస్థాన్‌ను గట్టిగానే హెచ్చరిస్తుండటంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది.


భారత్ తన సైనిక చర్యను నిలిపివేసిందని.. కానీ భవిష్యత్తులో జరిగే ఉగ్రవాద దాడులకు నిర్ణయాత్మకంగా స్పందించడానికి రెడీగా ఉందని గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అనేకసార్లు స్పష్టం చేశారు. దీంతో ఉగ్రవాదంపై భారత్ కఠిన వైఖరి అవలంభిస్తున్న క్రమంలో.. ఏమైనా తేడా జరిగితే పాకిస్థాన్‌కు మూడినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa