ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రస్థాయి స్వచ్ఛాంధ్ర పురస్కారాలను ప్రకటించిన సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 04, 2025, 09:07 AM

రాష్ట్రంలో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలు, పట్టణాలకు అందించే స్వచ్ఛాంధ్ర పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాదికి గాను 'స్వచ్ఛ జిల్లా' అవార్డును అనంతపురం జిల్లా కైవసం చేసుకుంది. ఈ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 6వ తేదీన విజయవాడలో ఘనంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు స్వయంగా అవార్డులు అందజేయనున్నారు.ఈ అవార్డుల వివరాలను స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ మేనేజింగ్ డైరెక్టర్ బి. అనీల్‌కుమార్‌రెడ్డి శనివారం మీడియాకు వెల్లడించారు. మూడు లక్షల లోపు జనాభా ఉన్న పట్టణాల విభాగంలో గుంటూరు జిల్లాలోని మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు తాడిపత్రి, బొబ్బిలి మున్సిపాలిటీలు అగ్రస్థానాల్లో నిలిచాయని ఆయన వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,326 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరిలో రాష్ట్రస్థాయిలో 69 మంది, జిల్లా స్థాయిలో 1,257 మంది విజేతలు ఉన్నారని పేర్కొన్నారు.రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రతి ఏటా ఈ అవార్డులను అందిస్తున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ఈ పురస్కారాలు స్ఫూర్తినిస్తాయని అనీల్‌కుమార్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa