ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం నిధుల బదిలీలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 04, 2025, 09:11 AM

బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం పనులు ఒకవైపు వేగంగా సాగుతుండగా, మరోవైపు నిర్వాసితుల సహాయ, పునరావాసానికి సంబంధించిన నిధుల విషయంలో తీవ్ర జాప్యం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక ఖాతాకు పూర్తిగా బదిలీ చేయకపోవడంపై కేంద్ర జలశక్తి శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం ప్రాజెక్టు పురోగతిపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం రూ. 5,052.71 కోట్లను విడుదల చేయగా, అందులో రూ. 1,830 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఏకీకృత ఖాతాకు బదిలీ చేయాల్సి ఉంది. అయితే, కేంద్రం నుంచి వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తన ఖాతాలో జమ చేసుకుంది. పోలవరం కోసం ప్రత్యేకంగా తెరిచిన ఖాతాలోకి నిధులను పూర్తిగా మళ్లించకపోవడంపై కేంద్రం ఇటీవల అసహనం వ్యక్తం చేసింది. ఈ నిధులు బదిలీ అయితేనే సహాయ, పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేసేందుకు వీలుంటుందని జలవనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, 41.15 మీటర్ల కాంటూరు పరిధిలో భూసేకరణ, పునరావాసం కోసం అదనంగా రూ. 1,107 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు.ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌తో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇతర ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ప్రాజెక్టు పురోగతితో పాటు, నిధుల బదిలీ అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.గోదావరి నదికి వరద వస్తున్నప్పటికీ, పోలవరం హెడ్‌వర్క్స్ పనులు మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు. అత్యంత క్లిష్టమైన డయాఫ్రమ్ వాల్ పనులలో ఇప్పటికే 56 శాతం (37,302 క్యూబిక్ మీటర్లు) పూర్తయ్యాయి. మిగిలిన పనులను ఈ డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బంకమన్ను ప్రాంతంలో జరుగుతున్న వైబ్రో కంపాక్షన్ పనులు కూడా 74 శాతం పూర్తయ్యాయి.డయాఫ్రమ్ వాల్ నిర్మాణం డిసెంబర్ 31 నాటికి పూర్తి కాగానే, దానిపై ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్ పనులను ప్రారంభించాలని జలవనరుల శాఖ భావిస్తోంది. వాస్తవానికి ఈ పనులను వచ్చే నెల నుంచే మొదలుపెట్టి, 2027 జులై నాటికి పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే, ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ డిజైన్లకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ, కేంద్ర జల సంఘం నుంచి ఇంకా ఆమోదం లభించాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa