విశాఖపట్నంలో దుర్గాదేవి మండపం వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. అన్నదాన సందర్భంగా మరుగుతున్న గంజి మీద పడి 16 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో చిన్నారులు, మహిళలు ఉన్నారు. విశాఖపట్నంలోని జాలరిపేటలో ఉన్న పిల్లా అప్పమ్మయ్య సంఘం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘం వద్ద దసరా సందర్భంగా దుర్గాదేవి మండపం ఏర్పాటు చేశారు. అయితే మండపం వద్ద శనివారం రోజున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పలువురు మహిళలు, చిన్నారులు అక్కడకు చేరుకున్నారు. అయితే వంట చేస్తున్న ప్రాంతంలో ప్రమాదవశాత్తూ మరుగుతున్న వేడి గంజి చిన్నారులు, మహిళలపై పడింది. ఈ ఘటనలో 16 మంది చిన్నారులు సహా మహిళలకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గాయపడిన వారిని విశాఖ కేజీహెచ్కు తరలించారు.
మరోవైపు ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వెంటనే కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణితో మాట్లాడారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని కోరారు. గాయపడిన చిన్నారులు ప్రస్తుతం కేజీహెచ్ ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారు. గాయపడిన వారిని ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్ట్ ఛైర్మన్ సుధాకర్ పరామర్శించారు. అయితే ఈ ఘటనతో సంబరం కాస్తా విషాదంగా మారిపోయింది.
ఆన్లైన్ బెట్టింగ్.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య
మరోవైపు ఆన్లైన్ బెట్టింగ్కు మరో ప్రాణం బలైంది. బెట్టింగ్ల ఉచ్చులో చిక్కుకుని విశాఖపట్నంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంవీపీ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నక్కవానిపాలెనికి చెందిన 33 ఏళ్ల షేక్ ఎండీ రసూల్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. అయితే రసూల్ గత కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డారు. ఇందుకోసం అప్పులు చేశారు. ఈ అప్పులను తీర్చేందుకు హైదరాబాద్లోని ఫ్లాట్ను కూడా అమ్మేశారు. అప్పటి నుంచి డిప్రెషన్లోకి వెళ్లిపోయిన రసూల్.. ఈ మధ్యనే విశాఖ వచ్చారు.
అక్టోబర్ 2న రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి రసూల్ భోజనం చేశారు. ఆ తర్వాత పడుకుంటానని చెప్పిన రసూల్.. మేడపైకి వెళ్లారు. అక్కడ సీలింగ్ ఫ్యాన్ హుక్కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉదయం ఎంతసేపైనా రసూల్ కిందకు రాకపోవటంతో అతని కుటుంబ సభ్యులు వెళ్లి గది తలుపులు బద్ధలు కొట్టారు. అయితే అప్పటికే రసూల్ ఉరేసుకుని కనిపించాడు. కుటుంబసభ్యులు వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. రసూల్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa