ఉగ్రవాదాన్ని పెంచి పోషించి, ఇతర దేశాలపై దాడులకు పాల్పడే ఉగ్రదేశం పాకిస్థాన్కు భారత ఆర్మీ చీఫ్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానకపోతే, దాని భౌగోళిక ఉనికికే ముప్పు వాటిల్లుతుందని, ప్రపంచ పటం నుండి ఆ దేశం కనుమరుగవుతుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గట్టి సందేశాన్ని ఇచ్చారు. రాజస్థాన్లోని అనూప్గఢ్లో ఉన్న ఆర్మీ పోస్టులో సైనికులను ఉద్దేశించి మాట్లాడిన జనరల్ ద్వివేది, పాకిస్థాన్ తన ఉనికిని నిలుపుకోవాలంటే ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం వెంటనే ఆపాలని స్పష్టం చేశారు. ఈసారి భారత దళాలు ఎటువంటి సంయమనం పాటించేది లేదని, అవసరమైతే పాకిస్థాన్ను చరిత్ర నుండి చెరిపివేసేందుకు వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. ఒకవేళ ఇస్లామాబాద్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడం ఆపకపోతే 'ఆపరేషన్ సిందూర్' రెండో వెర్షన్ అమలు చేయడం సుదూరంలో లేదని ఆయన పరోక్షంగా చెప్పుకొచ్చారు..
"ఈసారి మేము ఆపరేషన్ సింధూర్ 1.0 సమయంలో పాటించిన సంయమనాన్ని పాటించము. ఈసారి మేము చేసే చర్య పాకిస్థాన్ భౌగోళిక పటంలో తమ స్థానం కొనసాగాలా వద్దా అని ఆలోచించుకునేలా చేస్తుంది. పాకిస్థాన్ భౌగోళిక ఉనికిని నిలుపుకోవాలంటే, అది రాజ్య ప్రేరేపిత ఉగ్రవాదాన్ని వెంటనే ఆపాలి" అని ఆయన గట్టిగా చెప్పారు. సైనికులను కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని ఆదేశించిన ఆర్మీ చీఫ్.. "దేవుడి దయ ఉంటే, మీకు త్వరలోనే ఆ అవకాశం లభిస్తుంది, ఆల్ ది బెస్ట్" అని సైనికుల్లో స్ఫూర్తిని నింపారు.
జనరల్ ద్వివేది ఈ హెచ్చరిక చేయడానికి కొద్దిసేపటి ముందు, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ 'ఆపరేషన్ సింధూర్' సమయంలో భారత వైమానిక దళాలు అమెరికా తయారు చేసిన ఎఫ్-16, చైనా తయారు చేసిన జేఎఫ్-17 సహా నాలుగు నుంచి ఐదు పాకిస్థానీ యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు వెల్లడించారు.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత దళాలు మే 7న 'ఆపరేషన్ సిందూర్' చేపట్టింది. ఈ భారీ సైనిక చర్యలో భాగంగా భారత బలగాలు సుదూర లక్ష్యాలను ఛేదించగల ఆయుధాలతో పాకిస్థాన్లోని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని దాదాపు తొమ్మిది ఉగ్ర శిబిరాలపై దాడులు చేశాయి. ఈ దాడులు ఇరు దేశాల మధ్య దాదాపు యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయి. పాక్ కమాండర్లు కాల్పుల విరమణ కోసం అభ్యర్థించిన తర్వాత మే 10న కాల్పులు నిలిపివేశారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో అమాయక ప్రజలకు, సైనిక లక్ష్యాలకు హాని కలగకుండా, కేవలం ఉగ్రవాద స్థావరాలు, శిక్షణ కేంద్రాలను, వాటి సూత్రధారులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని జనరల్ ద్వివేది తెలిపారు. ఆపరేషన్ సమయంలో ధ్వంసమైన ఉగ్ర స్థావరాలకు సంబంధించిన ఆధారాలను భారత్ ప్రపంచానికి సమర్పించింది. అలా చేయకపోతే పాకిస్థాన్ వాస్తవాలను దాచిపెట్టేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్లో విశేష ప్రతిభ కనబర్చిన రాజ్పుతానా రైఫిల్స్కు చెందిన మేజర్ రితేష్ కుమార్, బీఎస్ఎఫ్ 140వ బెటాలియన్ కమాండెంట్ ప్రభాకర్ సింగ్, హవల్దార్ మోహిత్ గైరా వంటి అధికారులను ఆర్మీ చీఫ్ సన్మానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa