జమ్మూ కాశ్మీర్లోని సాంబ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సరిహద్దు గ్రామంపై పాకిస్థానీ డ్రోన్ ఎగురుతూ కనిపించడంతో భద్రతా దళాలు వెంటనే భారీ గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ విషయాన్ని అధికారులు శనివారం నాడు వెల్లడించారు. పాకిస్థాన్ వైపు నుంచి వచ్చినట్లుగా భావిస్తున్న ఈ డ్రోన్ తరహా వస్తువు రామ్గఢ్ సెక్టార్లోని నంగా గ్రామం మీదుగా శుక్రవారం రాత్రి ఆలస్యంగా చక్కర్లు కొట్టింది. దీనిని గమనించిన సరిహద్దు ప్రాంతవాసులు, భద్రతా సిబ్బంది వంటనే అప్రమత్తం అయ్యారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సరిహద్దు దాటి వచ్చి, భారత భూభాగంలోకి ప్రవేశించిన ఈ డ్రోన్ ద్వారా ఆయుధాలు లేదా మాదకద్రవ్యాలు వంటి అక్రమ వస్తువులను జారవిడిచే అవకాశం ఉండవచ్చని భద్రతా దళాలు అనుమానించాయి. ఈ నేపథ్యంలోనే ఎటువంటి ప్రమాదకర వస్తువులు గానీ ఆయుధాల ముఠా సభ్యులు గానీ సరిహద్దు దాటి వచ్చి ఉండకూడదనే ఉద్దేశంతో.. భద్రతా బలగాలు, పోలీసు బృందాలు తక్షణమే ఆ ప్రాంతానికి చేరుకుని విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
పాకిస్తాన్ డ్రోన్ కదలికల నేపథ్యంలో.. సరిహద్దు గ్రామాలన్నింటిలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా నంగా గ్రామం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ అదనపు బలగాలను మోహరించి, ప్రతి అంగుళాన్ని పరిశీలించారు. ఎక్కడా ఏమీ పట్టుబడకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు దాన్ని పంపారు, కావాలనే చేశారా, ఎవరైనా అనుకోకుడా ఇటువైపు పంపారా అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు సరిహద్దుల వెంబడి ఇలా డ్రోన్ల సంచారం ఇటీవల కాలంలో పెరిగింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలు జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలను పునరుద్ధరించడానికి, భారత భూభాగంలోకి అక్రమంగా ఆయుధాలు, నగదు, డ్రగ్స్ను తరలించడానికి ఈ డ్రోన్లను వాడుతున్నట్లుగా భద్రతా సంస్థలు గుర్తించాయి. ఈ డ్రోన్ల ముప్పును ఎదుర్కొనేందుకు సరిహద్దు భద్రతా దళం (BSF), ఇతర ఏజెన్సీలు అత్యాధునిక నిఘా వ్యవస్థలను ఉపయోగిస్తున్నాయి. తాజాగా జరిగిన ఈ డ్రోన్ గుర్తింపు కూడా ఇదే తరహా అక్రమ కార్యకలాపాల కోణం నుంచి దర్యాప్తు జరుగుతోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa