ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టీల్ ప్లాంట్ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 06, 2025, 07:43 PM

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, మనుగడ కోసం పోరాడుతున్న విశాఖ ఉక్కు కర్మాగారం  మళ్లీ ప్రగతి పథంలోకి దూసుకెళుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి కృషితో కేవలం ఏడాది వ్యవధిలోనే ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం అద్భుతంగా మెరుగుపడిందని తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌లో కేవలం 25 శాతంగా ఉన్న కెపాసిటీ వినియోగం, ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి ఏకంగా 79 శాతానికి చేరుకోవడం ప్లాంట్ పునరుజ్జీవానికి సంకేతంగా నిలుస్తోందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అమరావతి సచివాలయంలో స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి, దానిని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉంది. ఏడాది కాలంలో సాధించిన ఈ ప్రగతి ఎంతో సంతోషాన్నిచ్చే విషయం" అని అన్నారు. ప్లాంట్‌ను నష్టాల నుంచి గట్టెక్కించి, లాభాల బాట పట్టించాలంటే యాజమాన్యం, కార్మికులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుని, ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. ఈ ప్రయత్నాల ఫలితంగా కేంద్రం రూ.11,440 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఈ నిధులలో మెజారిటీ మొత్తం ఇప్పటికే విడుదల కావడంతో, వాటిని వినియోగించి ప్లాంట్‌ను తిరిగి గాడిన పెట్టే పనులు వేగవంతమయ్యాయి. కేంద్రం నుంచి అందిన ఆర్థిక చేయూతకు, రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు అందిస్తున్న సహకారం తోడవడంతో ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి సాధ్యమైందని అధికారులు సీఎంకు వివరించారు.సాధించిన ప్రగతిని అభినందించిన ముఖ్యమంత్రి, భవిష్యత్ లక్ష్యాలపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. "ప్రస్తుతం 79 శాతానికి చేరిన ఉత్పత్తి సామర్థ్యాన్ని మూడో త్రైమాసికం ముగిసేలోగా 92.5 శాతానికి తీసుకెళ్లాలి. దీని కోసం అందరూ ఐక్యంగా కృషి చేయాలి" అని సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తిరిగి పూర్వ వైభవం సంతరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.ప్లాంట్ పనితీరు, పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కఠినమైన విధానాన్ని అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి తాను స్వయంగా స్టీల్ ప్లాంట్‌పై సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. అదేవిధంగా, ప్రతి నెలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  స్థాయిలో సమీక్ష జరిపి, పురోగతి నివేదికను తనకు అందించాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌తో పాటు ఆర్‌ఐఎన్‌ఎల్ సీఎండీ అజిత్ కుమార్ సక్సేనా, కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అబిజిత్ నరేంద్ర, డైరెక్టర్ జీవీఎన్ ప్రసాద్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa