ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ విద్యార్థులకు కొత్తగా మరో పథకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 06, 2025, 07:43 PM

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు సీఎం నారా చంద్రబాబు నాయుడు మరో శుభవార్త వినిపించారు. ఇప్పటికే విద్యార్థుల కోసం తల్లికి వందనం పథకం, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్లు, స్కాలర్ షిప్స్ వంటివి అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలనుకునే విద్యార్థులకు పావలా వడ్డీకే రుణాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. సోమవారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ సంక్షేమంపై మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు బ్యాంకులు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చేలా కొత్త పథకాన్ని రూపొందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎంతమంది విద్యార్థులైనా, ఎలాంటి పరిమితి లేకుండా, చదువుకునే వీలుండేలా ఈ పథకాన్ని రూపొందించాలని స్పష్టం చేశారు.


అలాగే దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు అయిన ఐఐటీ, ఐఐఎం, నీట్ వంటి వాటిలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు కూడా ఈ పథకం వర్తింపచేయాలని చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు ఇలాంటి విద్యార్థులకు నాలుగు శాతం వడ్డీకి బ్యాంకు రుణాలు అందిస్తారు. దానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని చంద్రబాబు చెప్పారు. 14 ఏళ్లలో రుణాన్ని చెల్లించుకునే వెసులుబాటు ఇస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అలాగే రాష్ట్రంలోని బీసీ విద్యార్ధుల కోసం రెండు చోట్ల ఐఐటీ, నీట్ కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.


మరోవైపు రాష్ట్రంలో ఉన్న హాస్టళ్లపైనా చంద్రబాబు చర్చించారు. అన్ని హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూల్స్‌గా మార్చే విషయంపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. ప్రతీ పేద విద్యార్ధికి నాణ్యమైన విద్య అందించడమే తమ ప్రభుత్వం ప్రాధాన్యమన్న చంద్రబాబు.. ఇందుకోసం అధికారులు కృషి చేయాలని చెప్పారు.


హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూల్స్‌గా అప్‌గ్రేడ్ చేయడం వలన విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందుతుందని అభిప్రాయపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో సౌకర్యాలు కల్పించాలని.. మౌలిక వసతులు మెరుగుపరచాలన్నారు. ఈ హాస్టల్స్‌లలో ఏవైనా మరమ్మతులు ఉంటే ఏడాదిలోపు పూర్తి చేయాలన్నారు. గురుకులాల్లో పరిశుభ్రమైన పరిస్థితులు ఉండాలని.. విద్యార్ధుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa