ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టర్కీకి చేరువగా భారత యుద్ధ నౌకలు.. పాక్ మిత్రదేశానికి ఇండియా చెక్

international |  Suryaa Desk  | Published : Mon, Oct 06, 2025, 09:10 PM

2023 ఫిబ్రవరిలో సంభవించిన భారీ భూకంపం ధాటికి టర్కీ విలవిల్లాడింది. దీంతో ‘ఆపరేషన్ దోస్త్’ పేరిట భారత్ ఆ దేశానికి ఆపన్న హస్తం అందించింది. అయితే రెండేళ్ల తర్వాత జరిగిన ఆపరేషన్ సింధూర్‌ లో ఆ దేశం పాకిస్థాన్‌కు సాయం చేసింది. మనం చేసిన సాయాన్ని మర్చిపోయి పాక్‌కు డ్రోన్లు సాయం చేయడంతోపాటు.. కరాచీ పోర్టుకు రక్షణగా ఉండటం కోసం యుద్ధ నౌకలను సైతం పంపినట్లు వార్తలొచ్చాయి.


దీంతో టర్కీకి చెక్ పెట్టడానికి భారత్ రంగంలోకి దిగింది. ఈ ఏడాది జూన్ నెలలో ప్రధాని మోదీ సైప్రస్‌లో పర్యటించారు. అది మొదలు టర్కీ పెరట్లో భారత్ ఆట మొదలైంది. టర్కీ తీరానికి చేరువగా.. మధ్యదరా సముద్ర జలాల్లో భారత యుద్ధ నౌకలు గస్తీ కాస్తూ.. ఆ దేశంపై నిరంతరం ఓ కన్నేసి ఉంచుతున్నాయి. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా.. టర్కీతో దీర్ఘకాలికంగా వివాదాలు ఉన్న గ్రీస్, సైప్రస్, అర్మేనియాలతో భారత్ దోస్తీ చేస్తోంది. ఈ మూడు దేశాలతో భారత్ తన నౌకాదళ సంబంధాలను బలోపేతం చేసుకుంది. ఈ మూడు దేశాలను సమన్వయం చేసుకుంటూ.. నౌకాదళ విన్యాసాలు, సంయుక్త శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్న భారత్.. టర్కీకి చాలా స్పష్టమైన సంకేతాలను పంపిస్తోంది.


1971 నాటి ఇండో-పాకిస్థాన్ యుద్ధం సహా అనేక సందర్భాల్లో.. టర్కీ పాకిస్థాన్‌కు సైనిక మద్దతు అందించింది. టర్కీ సైనికులు పాకిస్థాన్ బలగాలకు శిక్షణ ఇచ్చారు. అంకారా సరఫరా చేసిన బైరక్టార్ టీబీ-2 డ్రోన్‌లను కూడా భారత దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించారు. అంతేకాకుండా టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్ అంశాన్ని పదేపదే ప్రస్తావించడం కూడా ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతీసింది.


మరోవైపు అజర్‌బైజాన్, టర్కీ మధ్య ఉన్న అర్మేనియా 2022 నుంచి అధునాతన సైనిక వ్యవస్థల కోసం భారతదేశంపై ఆధార పడుతోంది. న్యూఢిల్లీ ఈ దేశానికి ఆకాశ్-1ఎస్ వైమానిక రక్షణ వ్యవస్థలు, పినాకా మల్టిపుల్ లాంచ్ రాకెట్ వ్యవస్థలు, ఫిరంగి దళాలు, ట్యాంక్ విధ్వంసక రాకెట్లు, డ్రోన్ నిరోధక సాంకేతికతను సరఫరా చేసింది. టర్కీ మద్దతు ఉన్న అజర్‌బైజాన్‌కు వ్యతిరేకంగా అర్మేనియా రక్షణను ఇది బలోపేతం చేస్తుంది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఏదైనా సంఘర్షణ ఏర్పడితే భారతీయ, టర్కీ ఆయుధాలు తలపడే అవకాశం ఉంది.


మరోవైపు గ్రీస్ భారత దేశపు మధ్యధరా వ్యూహంలో కీలక భాగస్వామిగా మారింది. టర్కీ సముద్ర, గగనతల ఆధిపత్య వాదనల గురించి ఇరు దేశాలు ఉమ్మడి ఆందోళనలను పంచుకుంటున్నాయి. పహల్గామ్ దాడుల తర్వాత గ్రీస్ భారత దేశానికి బహిరంగంగా మద్దతు ఇచ్చింది. రఫేల్ ఫైటర్ జెట్‌లు, యుద్ధ సమాచార భాగస్వామ్యంపై కార్యాచరణ మార్గదర్శకాలను కూడా అభ్యర్థించింది. 2025 సెప్టెంబర్‌లో ఐఎన్‌ఎస్ త్రికండ్.. గ్రీక్ నౌకాదళంతో తొలి ద్వైపాక్షిక నావికా విన్యాసాన్ని నిర్వహించింది. ఇందులో జలాంతర్గామి వ్యతిరేక యుద్ధం, నైట్ బోర్డింగ్ డ్రిల్స్ వంటివి ఉన్నాయి. భారతదేశం గ్రీస్‌కు నేలపై నుంచి దాడి చేసే దీర్ఘ శ్రేణి క్రూయిజ్ క్షిపణులను సరఫరా చేసే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.


సైప్రస్‌కు 1983 నుంచే టర్కీతో సమస్యలు ఉన్నాయి. 2025 జూన్ నెలలో.. భారత ప్రధాని నరేంద్ర మోదీ 23 ఏళ్ల తర్వాత సైప్రస్‌ను సందర్శించి, ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్‌తో కలిసి ఐదేళ్ల వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేశారు. 2025 సెప్టెంబర్‌లోఐఎన్‌ఎస్ త్రికండ్ సైప్రియట్ నౌకాదళంతో పాసెక్స్ డ్రిల్స్‌ను నిర్వహించడం ద్వారా తూర్పు మధ్యధరాలో భారతదేశ ప్రభావాన్ని పెంచింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. భారతదేశం యొక్క ఈ చర్యలు దౌత్యం, అధునాతన రక్షణ సాంకేతికత, సముద్ర ఆధిపత్యాన్ని మిళితం చేస్తూ, టర్కీ చుట్టూ ఒక వ్యూహాత్మక మార్గాన్ని సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa