ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లవర్‌ను సజీవంగా పాతిపెట్టి..! సమాధిపైనే రెండు రోజులు నిద్ర

national |  Suryaa Desk  | Published : Tue, Oct 07, 2025, 08:30 PM

నమ్మిన వాళ్లనే కడతేర్చుతున్నారు చాలా మంది. కొన్ని సందర్భాల్లో చంపాలనుకున్న వాళ్లను.. పక్కా ప్రణాళిక ప్రకారం పిలిపించి మరీ హత్య చేస్తున్నారు. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో జరిగింది. ప్రియురాలిని ఇంటికి పిలిచి మరీ హత్య చేశాడో వ్యక్తి. అనంతరం ఆమె మృతదేహాన్ని ఇంటి వెనుక పెరట్లో పాతిపెట్టాడు. అదే సమాధిపై రెండు రాత్రులు నిద్ర చేశాడు. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నివారి జిల్లాలోని ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబర్ 2న జరిగిన ఈ ఘటన.. స్థానికంగా కలకలం సృష్టించింది.


పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. నిందితుడు రతిరాం రాజ్‌పుత్.. వివాహిత అయిన తన ప్రియురాలిని అక్టోబర్ 2న ఇంటికి పిలిచాడు. ఆరోజు రాత్రి ఇద్దరూ ఏకాంతంగా గడిపారు. ఆ తర్వాత కొద్ది సేపటికి ప్రియురాలిపై.. దాడి చేసి చంపేశాడు రతిరాం. అనంతరం తన స్నేహితులు కాళీచరణ్, ముఖేష్, జ్ఞాన్ సింగ్ సహాయంతో.. తన ఇంటి వెనుక ఉన్న స్థలలో గొయ్యి తవ్వి, ఆమె మృతదేహాన్ని పాతిపెట్టారు. తర్వాత ఆ సమాధిని మట్టి, ఆవు పేడతో కప్పేశారు. దానిపై మంచం వేసి.. ఎవరికీ అనుమానం రాకుండా రెండు రాత్రులు అక్కడే పడుకున్నాడు.


మరోవైపు, ఆ వివాహిత ఇంటికి తిరిగి రాకపోవడంతో.. ఆమె కుటుంబ సభ్యులు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. దర్యాప్తులో భాగంగా పోలీసులకు రతిరాంపై అనుమానం వచ్చి అక్టోబర్ 4న అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా.. నిందితుడు తానే హత్య చేసినట్లు నేరం అంగీకరించాడు.


నిందితుడు చెప్పిన వివరాలతో ఆ మహిళ మృతదేహాన్ని వెలికి తీసి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అరెస్ట్ చేసిన మరుసటి రోజే రతిరాం పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. నిందితుడి కస్టడీలో పెట్టుకుని నిర్లక్ష్యం వహించినందుకు ఇద్దరు పోలీసులు సస్పెండ్ అయ్యారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.


సజీవంగా పాతిపెట్టాడు!


రతిరామ్‌ను బాధితురాలు వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసిందని.. అందుకోసం తన భర్తను సైతం విడిచిపెట్టడానికి సిద్ధమైందని పోలీసులు తెలిపారు. అయితే నిందితుడు ఆమెతో సంబంధాన్ని కొనసాగించడానికి ఇష్టపడలేదని.. అందుకే ప్రియురాలిని చంపేయాలని ప్లాన్ వేశాడని వెల్లడించారు. కాగా, వివాహితను బ్లేడ్‌తో కోసి.. కరెంట్ షాక్ ఇచ్చి చిత్రహింసలకు గురిచేశారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతేకాకుండా సజీవంగా పాతిపెట్టి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశారు. రతిరాంను వెంటనే అరెస్టు చేయాలని, ఇంతటి దారుణానికి పాల్పడ్డవాడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa