ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో ఆందోళనకలిగిస్తోన్న భారతీయుల మరణాలు

international |  Suryaa Desk  | Published : Tue, Oct 07, 2025, 09:43 PM

అమెరికాలో గుజరాతీ పటేళ్లు ఏర్పాటు చేసిన మోటెల్ సామ్రాజ్యం ఇప్పుడు వారికే శాపంగా మారుతోంది. నెల రోజుల్లోనే వేర్వేరు దాడుల్లో ముగ్గురు గుజరాతీ వ్యాపారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఏడుగురు గుజరాతీలు మోటెల్స్, గ్యాస్ స్టేషన్ల వద్ద జరిగిన ఘటనల్లో చనిపోయారు. అమెరికాలో దాదాపు 60% మోటెల్స్ గుజరాతీలు ముఖ్యంగా పటేళ్లవే. దేశం కాని దేశంలో కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించినా, ఇలా వరుసగా ప్రాణహాని కలగడం అందరినీ కలవరపెడుతోంది. రెండు రోజుల కిందట పిట్స్‌బర్గ్‌లో పార్కింగ్ వద్ద జరిగిన గొడవలో రాకేశ్ అనే వ్యాపారి ప్రాణాలు కోల్పోయారు.


మోటెల్స్ టార్గెట్‌కు ముఖ్య కారణాలు


సాధారణంగా మోటెల్స్, గ్యాస్ స్టేషన్లు ఎక్కువగా హైవేల పక్కన లేదా కొంచెం ఏకాంతంగా ఉండే ప్రాంతాల్లో ఉంటాయి. అందుకే నేరగాళ్లకు ఇవి సులువుగా టార్గెట్‌ అవుతాయి. ఈ ప్రాంతాలు దొంగతనాలు, డ్రగ్స్ డీల్స్, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు క్రైమ్ జోన్స్:గా మారుతున్నాయి. అందుకే మోటెల్స్‌ నుంచి పోలీస్ ఎమర్జెన్సీ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. అయితే, అమెరికాలో భారతీయుల హత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.


ఇక చాలామంది యజమానులు ఖర్చు తగ్గించుకోవడానికి కుటుంబ సభ్యులతోనే పనిచేయిస్తారు. సీసీ కెమెరాలు లేకపోవడం, లైటింగ్ తక్కువగా ఉండటం వంటి భద్రతా లోపాలు కూడా నేరగాళ్లకు వరంగా మారుతున్నాయి. చాలా మోటెల్స్‌లో యజమానుల కుటుంబాలు ఫ్రంట్ డెస్క్ వెనుకనే నివసిస్తాయి. దీనివల్ల వారు నేరుగా ప్రమాదానికి గురవుతున్నారు. ఇటీవల అమెరికాలో భారతీయులపై వరుస దాడులు చోటుచేసుకుంటున్నాయి.


పటేల్స్ మోటెల్స్ సామ్రాజ్యం ఎలా మొదలైంది?


1930ల నుంచి గుజరాతీలు ముఖ్యంగా పటేళ్లు అమెరికాకు వలస వెళ్లి, ఈ మోటెల్ వ్యాపారంలో అడుగుపెట్టారు. దీని వెనుక వారి బలమైన వ్యూహం ఉంది. కలిసి పనిచేయడం, అక్కడే నివాసం, లాభాల పెట్టుబడి, సామాజిక సాయం వంటివి వారి విజయంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. సామాజిక సహాయం: ఒకరికొకరు చేతి అప్పులు ఇచ్చుకుంటూ, కొత్తగా వచ్చిన గుజరాతీలకు సహాయం చేసి, ఈ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు.


కానీ.... పటేళ్ల విజయం ఆర్థికంగా లాభాన్ని ఇచ్చినా, వారిని మరింత ప్రమాదంలోకి నెడుతోంది. చిన్న పట్టణాల్లో ఉన్నత స్థానంలో ఉన్న భారతీయులపై కొందరిలో అసూయ లేదా వ్యతిరేకత పెరగడం కూడా దాడులకు దారితీస్తోంది. వారి వ్యాపారంలో సులభమైన విజయం వారిని దొంగతనాలు, కాల్పులకు సులభమైన టార్గెట్‌లుగా మారుస్తోంది. ఈ వరుస ఘటనల తర్వాత, తమ వ్యాపార కేంద్రాల వద్ద భద్రతను పెంచాలని, అమెరికా ప్రభుత్వం తమకు రక్షణ కల్పించాలని భారతీయ కమ్యూనిటీ కోరుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa