ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘బాగ్రామ్’‌ స్వాధీనానికి ట్రంప్ ప్లాన్.. ఏకతాటిపైకి భారత్, చైనా, రష్యా, పాకిస్థాన్

national |  Suryaa Desk  | Published : Wed, Oct 08, 2025, 08:12 PM

అఫ్గనిస్థాన్‌ రాజధాని కాబూల్ సమీపంలో బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి తమ నియంత్రణలోకి తీసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలపై భారత్ సహా పలు దేశాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. మీడియా నివేదికల ప్రకారం ఈ విషయంలో భారత్.. తాలిబన్, రష్యా, చైనా, పాకిస్థాన్‌‌లు ఒకే అభిప్రాయంతో ఉన్నాయిని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. అఫ్గనిస్థాన్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ స్థిరత్వం దృష్ట్యా బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని అమెరికా తిరిగి స్వాధీనం చేసుకోరాదని ఈ దేశాలు స్పష్టం చేశాయి. మాస్కో వేదికగా ఈ దేశాలకు చెందిన ప్రతినిధుల బృందం అఫ్ఘనిస్థాన్‌‌లో శ్రేయస్సు, అభివృద్ధిపై విస్తృత చర్చలు జరిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రణాళికను ఖండించింది.


 అఫ్గనిస్థాన్, దాని పొరుగు దేశాలలో తమ సైనిక మౌలిక సదుపాయాలను మోహరించడానికి ఇతర దేశాలు చేస్తోన్న ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదు.. ఎందుకంటే ఇది ప్రాంతీయ శాంతి, స్థిరత్వ ప్రయోజనాలకు విరుద్ధం’ అని ఈ దేశాలు అభివర్ణించాయి. ఈ చర్చల్లో తొలిసారి తాలిబన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తఖీ పాల్గొన్నారు. బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని మధ్య ఆసియాలో అమెరికా వ్యూహాత్మక పునరాగమనానికి ప్రధాన కేంద్రంగా మార్చుకోవాలనేది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్లాన్. కానీ, భారత్ సహా పలు దేశాలు దీన్ని ప్రాంతీయ శాంతి ప్రక్రియకు విఘాతం కలిగించేదిగా భావిస్తున్నాయి.


బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని అమెరికాకు అప్పగించాలని కొద్ది వారాల కిందట డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనలను తాలిబన్లు తిరస్కరించారు. మాస్కోలో జరిగిన చర్చల్లో పాల్గొన్న దేశాలు, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో సహకారాన్ని ద్వైపాక్షికంగా, బహుపాక్షిక స్థాయిలో మరింత బలపరచాల్సిన అవసరాన్ని గుర్తించాయి. ‘ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సమగ్ర చర్యలు చేపట్టేలా అఫ్గనిస్థాన్ మద్దతు ఇవ్వాలి. అఫ్గన్‌తో పాటు పొరుగు దేశాలు, ఇతర ప్రాంతాల భద్రతకు ముప్పుగా మారకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ దేశాలు హితవు పలికాయి’ అని ఓ సంయుక్త ప్రకటన తెలిపింది.


అలాగే, ఉగ్రవాదం అఫ్గనిస్థాన్‌, దాని పరిసర ప్రాంతాలు, అలాగే ప్రపంచ భద్రతకు ఒక తీవ్రమైన ముప్పుగా మారుతోందని ఈ దేశాలు స్పష్టంగా పేర్కొన్నాయి. ఈ సమావేశంలో భారత్, రష్యా, చైనాలతో పాటు ఇరాన్, కజికిస్థాన్, కిర్గిస్థాన్, పాకిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్‌లు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలోని దేశాలతో అఫ్గన్‌‌ ఆర్ధిక సంబంధాల అవసరాన్ని గుర్తించారు. ‘ప్రాంతీయ అనుసంధాన వ్యవస్థలో అఫ్గన్ క్రియాశీల ఏకీకరణకు మద్దతు ఇచ్చారు’ అని ప్రకటన పేర్కొంది.


ఈ సమావేశంలో రాయబారి వినయ్ కుమార్ నేతృత్వంలోని పాల్గొన్న భారత ప్రతినిధుల బృందం.. అఫ్గనిస్థాన్‌ స్వాతంత్ర్యం, శాంతి, స్థిరత్వం, సామాజిక ఆర్ధికాభివృద్ధి, ప్రజల శ్రేయస్సుకు భారత్ మద్దతు ఇస్తుందని స్పష్టం చేసినట్టు రష్యాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. సురక్షితమైన, శాంతియుతమైన, స్థిరమైన అఫ్గనిస్థాన్.. ఆ ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని, ప్రాంతీయ స్థిరత్వం, ప్రపంచ భద్రతకు ప్రాథమికంగా ఉంటుందని భారత్ వైఖరిని కుమార్ పునరుద్ఘాటించారని సోషల్ మీడియాలో పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa