ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరూర్ తొక్కిసలాట ఘటనపై .. సుప్రీంకోర్టుకు టీవీకే చీఫ్

national |  Suryaa Desk  | Published : Wed, Oct 08, 2025, 08:13 PM

తమిళనాడులోని కరూర్ జిల్లాలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్).. దర్యాప్తు జరుపుతోంది. ఈ క్రమంలోనే టీవీకే పార్టీ తీరు, ర్యాలీ తర్వాత నిర్వాహకులు అక్కడి నుంచి వెళ్లిపోవడాన్ని మద్రాస్ హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. అయితే ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టు ఇఛ్చిన ఆదేశాలపై.. టీవీకే చీఫ్ విజయ్ .. బుధవారం సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సిట్‌ దర్యాప్తునకు సంబంధించి మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంలో సవాల్‌ చేశారు. తమ పార్టీకి వ్యతిరేకంగా సిట్‌ వ్యవహరిస్తోందని ఆరోపించారు.


సీనియర్ ఐపీఎస్ అధికారి అస్రాగార్గ్ నేతృత్వంలో కరూర్ తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే సిట్ ఏర్పాటైంది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన టీవీకే.. పోలీస్ అధికారుల దర్యాప్తు, అధికారుల పాత్రపైనా తాము ఇదివరకే ప్రశ్నలు లేవనెత్తినట్లు గుర్తు చేసింది. తమిళనాడు రాష్ట్ర పోలీస్ అధికారులతోనే మద్రాస్ హైకోర్టు సిట్‌ను ఏర్పాటు చేసిందని ఆ పిటిషన్‌లో టీవీకే పేర్కొంది. ఈ క్రమంలోనే తమ పార్టీపై సిట్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.


ఇక విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు.. టీవీకే పార్టీపై, ఆ పార్టీ చీఫ్ విజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విజయ్‌కి లీడర్ లక్షణాలు లేవని.. తొక్కిసలాట జరిగిన తర్వాత టీవీకే నేతలు అంతా అక్కడి నుంచి పారిపోయారని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా కరూర్‌ తొక్కిసలాట ఘటనలో టీవీకే పార్టీ తీరును కూడా మద్రాస్ హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపడితే.. టీవీకే పార్టీ నిర్వాహకులు మాత్రం వెళ్లిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌‌లో ఈ విషయాన్ని ప్రస్తావించిన.. అయితే హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే ఈ కేసు దర్యాప్తును ప్రభావితం చేసినట్లు తెలిపింది. ఇక తన ర్యాలీని ఫెయిల్ చేసేందుకు ముందస్తు కుట్రలు జరిగినట్లు కూడా ఆ పార్టీ అనుమానం వ్యక్తం చేసింది.


గత నెల 27వ తేదీన కరూర్ జిల్లాలో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌ చేపట్టిన ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటనలో బాధిత కుటుంబాలను కలిసేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ తమిళనాడు డీజీపీకి విజయ్‌ ఈ-మెయిల్‌ పంపించారు. తమ వారిని కోల్పోయి బాధలో ఉన్న కుటుంబాలను తాను స్వయంగా కలిసి పరామర్శించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.


ఇక ఇప్పటికే బాధిత కుటుంబాలతో వీడియో కాల్‌లో మాట్లాడిన విజయ్.. వారిని ఓదార్చారు. త్వరలోనే స్వయంగా వచ్చి కలుస్తానని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో విజయ్ తప్పులేదని.. ఆయన తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించాలని బాధిత కుటుంబాలకు చెందిన వారు కోరినట్లు టీవీకే నేత అరుణ్ రాజ్ తెలిపారు. మరోవైపు.. తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన 13 ఏళ్ల బాలుడి తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ తొక్కిసలాట కేసును సీబీఐకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa