బీహార్ లోని ఖతిహార్ జిల్లాలో అధికారులు రూ.6 కోట్లు వెచ్చించి ఓ బ్రిడ్జిని నిర్మించారు. దాదాపు పది, పన్నెండు గ్రామాల మధ్య రాకపోకలకు అనువుగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం కింద ఈ నిర్మాణం చేపట్టారు. నాలుగేళ్లలో వంతెన పూర్తయినా, అది నిరుపయోగంగానే మిగిలిపోయింది. దీనికి కారణం బ్రిడ్జికి ఒకవైపు అప్రోచ్ రోడ్డు నిర్మించకపోవడమే. ఇవతలివైపు రోడ్డు ఉన్నా బ్రిడ్జి దాటాకా అన్నీ పంటపొలాలే ఉండడంతో బ్రిడ్జి నిర్మించి ఉపయోగం లేకుండా పోయింది. ఖతిహార్ జిల్లా దండ్కోడా బ్లాక్ లో నిర్మించిన ఈ బ్రిడ్జి అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. బ్రిడ్జి నిర్మాణానికి అనుమతిచ్చిన అధికారులు.. అవతలివైపు భూసేకరణ చేసి రోడ్డు నిర్మించేందుకు ప్రయత్నించకపోవడం విమర్శలకు దారితీసింది. నాలుగేళ్ల క్రితం ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలు పెట్టిన తర్వాతైనా అప్రోచ్ రోడ్డు నిర్మాణం కోసం అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. అప్రోచ్ రోడ్డు నిర్మిస్తే 12 గ్రామాలకు చెందిన ప్రజలు జిల్లా కేంద్రానికి సులభంగా చేరుకోవడానికి వీలుంటుందని చెబుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి అప్రోచ్ రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa