పేర్ని నాని ఒక ప్రజాప్రతినిధా లేక వీధి రౌడీనా అంటూ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మచిలీపట్నం ఆర్పేట పోలీస్ స్టేషన్లోకి పేర్ని నాని అక్రమంగా ప్రవేశించి, పోలీసులను బెదిరించి, అవమానించారని మంత్రి మండిపడ్డారు. వ్యవస్థల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా, కనీస విచక్షణ మరిచి ఆయన ప్రవర్తించిన తీరు సిగ్గుచేటని విమర్శించారు.పోలీస్ స్టేషన్లోకి చొరబడి, విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిని ఏకవచనంతో సంభోదిస్తూ వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూడటం దారుణమని కొల్లు రవీంద్ర అన్నారు. పేర్ని నాని చర్యలు ఒక వీధి రౌడీని తలపిస్తున్నాయని, ఇది దుర్మార్గమైన చర్య అని అభిప్రాయపడ్డారు. అధికారం పోయినా పేర్ని నానిలో అహంకారం మాత్రం తగ్గలేదని ఎద్దేవా చేశారు. "గల్లీ రౌడీల్లా ప్రవర్తిస్తూ పోలీసులను బెదిరిస్తే చట్టం చేతులు కట్టుకుని కూర్చోదు" అని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా హెచ్చరించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి అరాచక శక్తులకు చోటు లేదని స్పష్టం చేశారు. పేర్ని నాని లాంటి వారిని కేవలం రాజకీయాల నుంచే కాకుండా సమాజం నుంచి కూడా బహిష్కరించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు ఇలాంటి చర్యలను చూస్తూ ఊరుకోరని గుర్తుచేశారు.చట్టానికి ఎవరూ అతీతులు కారని, ఈ ఘటనపై పేర్ని నాని కచ్చితంగా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మంత్రి తేల్చిచెప్పారు. వైసీపీ నాయకుల తీరు ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడి చేయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో చట్టాన్ని, పోలీసుల గౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని పునరుద్ఘాటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa