కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారం దుర్వినియోగంపై చెలరేగిన వివాదం తీవ్రరూపం దాల్చింది. ఆలయ నిర్వహణ చూస్తున్న ట్రావెంకోర్ దేవస్వం బోర్డు కార్యకలాపాలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేరళ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆలయ ద్వారపాలక విగ్రహాల బంగారు తొడుగుల వ్యవహారంలో జరిగిన అవకతవకలపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. ఈ ఘటనలో ఏకంగా నాలున్నర కిలోల బంగారం తేడా రావడం తీవ్ర కలకలం రేపుతోంది. 2019లో ఆలయంలోని ద్వారపాలక విగ్రహాల బంగారు తొడుగులకు మెరుగుపెట్టించే బాధ్యతను బెంగళూరుకు చెందిన ఉన్నికృష్ణన్ పొట్టి అనే వ్యక్తికి బోర్డు అప్పగించింది. ఆయన సొంత ఖర్చుతో ఈ పని చేయిస్తానని ముందుకు రావడంతో, 42.8 కిలోల బరువున్న బంగారు పూత పూసిన రాగి తొడుగులను ఆయన సమక్షంలోనే చెన్నైలోని ఓ వర్క్షాప్కు పంపారు. అయితే, శబరిమల నుంచి బయలుదేరిన కంటైనర్ 39 రోజుల తర్వాత చెన్నైకి చేరడం మొదటి అనుమానాలకు తావిచ్చింది. వర్క్షాప్లో తూకం వేయగా, తొడుగుల బరువు 38.25 కిలోలుగానే తేలింది. అంటే, మార్గమధ్యంలోనే దాదాపు 4.5 కిలోల బరువు తగ్గింది.ఈ 39 రోజుల ప్రయాణంలో కంటైనర్ కొట్టాయంలోని ఓ ప్రైవేటు ఆలయంతో పాటు, ఆంధ్రప్రదేశ్లోని పలు ఆలయాలకు, బెంగళూరులోని అయ్యప్ప ఆలయానికి కూడా వెళ్లినట్లు ఆరోపణలున్నాయి. ప్రముఖ నటుడు జయరాం ఇంట్లో జరిగిన ప్రైవేటు పూజకు కూడా ఈ విగ్రహ తొడుగులను తీసుకెళ్లినట్లు ఆరోపణలు రావడం వివాదాన్ని మరింత రాజేసింది. మరోవైపు, దాతగా ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టి.. మెరుగుల కోసం తన సొంత బంగారం 394 గ్రాములు కలిపినప్పటికీ, తిరిగి వచ్చిన తొడుగుల బరువు పెరగకపోవడం గమనార్హం.ఈ వ్యవహారంపై 2020లో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. సిట్ నివేదికలో బంగారం తేడా ఉన్నట్లు నిర్ధారణ కావడంతో తాజాగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తన వద్ద మిగిలిన ఆలయ బంగారాన్ని తన కుమార్తె పెళ్లికి వాడుకునేందుకు అనుమతివ్వాలని 2019లో ఉన్నికృష్ణన్ పొట్టి స్వయంగా బోర్డుకు ఈ-మెయిల్ పంపడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa