ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోషల్ మీడియా వేదికగా ట్రంప్ పై ప్రశంసల వర్షం కురిపించిన మరియా కొరీనా

international |  Suryaa Desk  | Published : Sat, Oct 11, 2025, 07:55 AM

నోబెల్ శాంతి బహుమతిని బాధల్లో ఉన్న వెనిజువెలా ప్రజలకు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అంకితం చేస్తున్నట్లు పురస్కార విజేత మరియా కొరీనా మచాడో ప్రకటించారు. ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ చివరకు వెనెజువెలా హక్కుల కార్యకర్త మరియా కొరీనా మచాడోను ఈ పురస్కారం వరించింది.దీనిపై తాజాగా మచాడో తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందిస్తూ ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ పురస్కారాన్ని వెనెజువెలా ప్రజలతోపాటు తమ ఉద్యమానికి మద్దతుగా నిలుస్తోన్న డొనాల్డ్ ట్రంప్‌కు అంకితం ఇస్తున్నానని పేర్కొన్నారు.వెనిజువెలా ప్రజల లక్ష్యానికి ట్రంప్ నిర్ణయాత్మకంగా మద్దతిచ్చినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మరియా పోస్టులో వెల్లడించారు. వెనిజువెలా ప్రజల పోరాటానికి దక్కిన ఈ గుర్తింపు తమ కర్తవ్యాన్ని ముగించడానికి ఒక ప్రోత్సాహకమని పేర్కొన్నారు. స్వేచ్ఛ పొందేందుకు దోహదపడుతుందన్నారు. విజయానికి చేరువలో ఉన్నామని పేర్కొన్నారు.నేడు గతంలో కంటే ఎక్కువగా, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని సాధించడానికి అధ్యక్షుడు ట్రంప్, అమెరికా ప్రజలు, లాటిన్ అమెరికా ప్రజలు, ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్య దేశాలను తమ ప్రధాన మిత్రులుగా విశ్వసిస్తున్నామని వివరించారు. అంతకుముందు నార్వే నోబెల్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ క్రిస్టియన్ బ్రెగ్ హార్ప్ క్వెన్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శాంతి పురస్కారాన్ని ఇవ్వనున్న విషయాన్ని ఆమెకు ముందుగానే తెలియజేశారు."నాకు ఈ పురస్కారం రావడం నమ్మలేకపోతున్నాను. మాటలు రావట్లేదు. వెనెజువెలా ప్రజల తరఫున ధన్యవాదాలు. మేము సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఇందుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నాం. తప్పకుండా విజయం సాధిస్తాం. ఇదో ఉద్యమం అని మీరు అర్థం చేసుకున్నారని భావిస్తున్నాను. అయితే, ఇది నా ఒక్కరి గెలుపు కాదు. వ్యక్తిగతంగా నేను దీనికి అర్హురాలిని కాదని అనుకుంటున్నాను. ఇది సమాజం మొత్తం సాధించిన విజయం. మా ప్రజలకు లభించిన అతిపెద్ద గుర్తింపు" అని మరియా కొరీనా వెల్లడించారు.వెనుజువెలా ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసినందుకు మరియా కోరీనాకు ఈ పురస్కారం ఇస్తున్నట్లు నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య సాధన కోసం శాంతి మార్గంలో ఆమె విశేష కృషి చేశారని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆమె ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నారని, ఏడాది పాటు అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చిందని పేర్కొంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa