ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళ మత్తులో పడి.. రక్షణ రహస్యాలు పాకిస్థాన్‌కు చేరవేసిన అల్వార్ వ్యక్తి అరెస్ట్

national |  Suryaa Desk  | Published : Sat, Oct 11, 2025, 07:12 PM

భారత రక్షణ రంగానికి చెందిన అత్యంత కీలకమైన సమాచారాన్ని శత్రు దేశానికి చేరవేస్తున్నారనే ఆరోపణలతో రాజస్థాన్‌లో ఇద్దరు వ్యక్తులను నిఘా వర్గాలు అరెస్టు చేశాయి. పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో రాజస్థాన్ ఇంటెలిజెన్స్ శుక్రవారం వారిని అరెస్టు చేసింది. రాష్ట్రంలోని రక్షణ స్థావరాలు, వ్యూహాత్మక ప్రాంతాలపై నిఘా ఉంచిన ఈ వ్యక్తులు.. సోషల్ మీడియా వేదికగా పాక్ ఏజెంట్లతో సంబంధాలు పెట్టుకున్నట్లు దర్యాప్తులో తేలింది.


రాజస్థాన్ ఇంటెలిజెన్స్ విభాగం శుక్రవారం నాడు అల్వార్‌ జిల్లాకు చెందిన మంగత్‌ సింగ్‌ అనే వ్యక్తి ఐఎస్‌ఐ కోసం గూఢచర్యం చేస్తున్నట్లు పక్కా సమాచారంతో అధికారులు అరెస్టు చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు రెండేళ్ల క్రితం సోషల్ మీడియాలో అతడికి ఇషా శర్మ అనే పాకిస్థానీ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కొద్ది కాలంలోనే ప్రేమగా మారినట్లు నమ్మించి, ఆ మహిళ అతన్ని ట్రాప్‌ చేసింది.


ఆ పాక్ మహిళ పట్ల ఏర్పడిన మోజుతో మంగత్‌ సింగ్‌ ఆమెకు దేశ రక్షణకు సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారాన్ని అందించడం ప్రారంభించాడు. ఇందులో భాగంగా అల్వార్ కంటోన్మెంట్ ఏరియాతో పాటు ఇతర కీలకమైన రక్షణ రంగ వ్యూహాత్మక కేంద్రాలకు సంబంధించిన వివరాలను అతను పాకిస్థాన్‌కు చేరవేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసును సెంట్రల్ ఎంక్వైరీ సెంటర్‌లో వివిధ నిఘా సంస్థల బృందాలు సంయుక్తంగా విచారిస్తున్నాయి.


మరో ఘటనలో జైసల్మేర్‌కు చెందిన మహేంద్ర ప్రసాద్‌ అనే వ్యక్తిని రాజస్థాన్ నిఘా విభాగం సీఐడీ మంగళవారం నాడు అదుపులోకి తీసుకుంది. మహేంద్ర ప్రసాద్‌ చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో ఉన్న డీఆర్‌డీఓ అతిథి గృహానికి మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తన ఉద్యోగ హోదాను అడ్డుపెట్టుకుని, ఇతను కూడా ఐఎస్‌ఐ కోసం గూఢచర్యం చేస్తున్నాడని అరెస్టు చేశారు.


డీఆర్‌డీఓ వంటి అత్యంత సున్నితమైన రక్షణ సంస్థకు సంబంధించిన అతిథి గృహంలో పనిచేస్తూ,, పాక్‌కు రహస్య సమాచారాన్ని అందించడం దేశ భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అంశమని నిఘా అధికారులు పేర్కొన్నారు. గూఢచర్యం, దేశ ద్రోహం వంటి నేరాలకు పాల్పడే వ్యక్తులు దేశంలో ఏ మూలన ఉన్నా, వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడానికి నిఘా సంస్థలు నిరంతరం అప్రమత్తంగా పని చేస్తున్నాయని సీఐడీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. దేశ రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అధికారులు తేల్చి చెప్పారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa