అఫ్గానిస్థాన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ ఢిల్లీలో నిర్వహించిన మీడియో సమావేశం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. తాలిబాన్ మంత్రి నిర్వహించిన సమావేశానికి మహిళా జర్నలిస్టులను ఎవరినీ ఆహ్వానించకపోవడమే వివాదానికి కారణం. ఈ అంశంపై దేశవ్యాప్తంగా ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో, మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండటంతో తాజాగా భారత ప్రభుత్వం స్పందించింది.
తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ నిర్వహించిన మీడియా సమావేశం నిర్వహణలో తమకు ఎలాంటి పాత్ర లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 'అఫ్ఘాన్ విదేశాంగ మంత్రి నిన్న(శుక్రవారం) ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఎటువంటి ప్రమేయం లేదు" అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తేల్చి చెప్పాయి. ఆ సమావేశాన్ని తాలిబాన్ ప్రతినిధులు సొంతంగా నిర్వహించుకున్నారని ప్రభుత్వం పరోక్షంగా చెప్పినట్లు అయింది.
మరోవైపు, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ఈ అంశంపై మోదీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. "మహిళల హక్కుల గుర్తింపు కేవలం ఎన్నికల వరకు మాత్రమే పరిమితమయ్యే తాత్కాలిక వైఖరి కాకపోతే, దేశానికి వెన్నెముకగా, గర్వకారణంగా ఉన్న మన మహిళలకు జరిగిన ఈ అవమానాన్ని మన దేశంలో ఎలా అనుమతించారు?" అని ఆమె ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం సైతం ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళా జర్నలిస్టులను సమావేశానికి పిలవకపోవడం తనను కలచివేసిందని పేర్కొన్నారు. మహిళా సహోద్యోగులను అనుమతించలేదని తెలిసిన వెంటనే, హాజరైన పురుష జర్నలిస్టులు ఆ ప్రెస్మీట్ నుంచి బయటకు వాకౌట్ చేసి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.
అఫ్ఘానిస్థాన్ విదేశాంగ మంత్రి ముత్తఖీ, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో భేటీ అయిన అనంతరం ఈ మీడియా సమావేశం జరిగింది. ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక వాణిజ్యం, మానవతా సహాయం, భద్రతా సహకారం వంటి కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. అయితే ముత్తఖీ నిర్వహించిన మీడియా సమావేశంలో మహిళా జర్నలిస్టులకు ప్రవేశం నిరాకరించడంతో ఆ కీలక చర్చల కంటే ఈ వివాదమే వార్తల్లో నిలుస్తోంది.
అఫ్ఘానిస్థాన్లో మహిళలపై కఠిన ఆంక్షలు విధించి, వారి విద్య, ఉద్యోగంలో వారిపై నిషేధం విధించిన తాలిబాన్ల వైఖరిని అంతర్జాతీయంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో భారత రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటన అంతర్జాతీయ వేదికపై భారతదేశ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఉందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa