ట్రెండింగ్
Epaper    English    தமிழ்

21 రోజులు, 13 దేశాలు.. 18,755 కి.మీ.లు..ప్రపంచంలోనే అతిపెద్ద రైలు ప్రయాణం.. టికెట్ ఎంతంటే?

international |  Suryaa Desk  | Published : Sat, Oct 11, 2025, 07:38 PM

రైలు ప్రయాణం చాలా మందికి చాలా ఇష్టం. దూర ప్రయాణాలు చేసేవారు.. ముందుగానే రైళ్లలో టికెట్ బుక్ చేసుకుని హాయిగా ప్రయాణిస్తారు. ఒక రోజు, రెండు రోజుల పాటు ఆ రైలులోనే ప్రయాణిస్తూ.. గమ్యాన్ని చేరుకుంటారు. కానీ ఈ రైలు మాత్రం ఒకట్రెండు రోజులు కాదు.. ఏకంగా 21 రోజుల పాటు పరుగులు పెడుతూనే ఉంటుంది. ఈ రైలు మొదలైన స్టేషన్ నుంచి చివరి స్టేషన్ వరకు 18,755 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇక 13 దేశాల గుండా ఈ రైలు ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఈ రైలు కేవలం 55 స్టేషన్లలో స్టేషన్లలో మాత్రమే ఆగుతుండటం విశేషం. అందులో 11 మాత్రమే చాలా ప్రసిద్ధి చెందిన స్టేషన్లు. ఇప్పటివరకు లండన్ నుంచి సింగపూర్ వరకు ప్రయాణించే రైలు ప్రపంచంలోనే అతి ఎక్కువ దూరం ప్రయాణించే రైలుగా ఉండగా.. ఆ స్థానాన్ని పోర్చుగల్ నుంచి సింగపూర్ వరకు వెళ్లే రైలు ఆక్రమించింది.


ఇక ఈ రైలు ప్రయాణం కేవలం దూరం పరంగానే కాకుండా.. ప్రయాణికులకు రెండు ఖండాల సంస్కృతులను, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను చూసే అరుదైన అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే ఈ సుదీర్ఘ ప్రయాణం.. ఏకంగా 18,755 కిలోమీటర్ల పాటు సాగుతుంది. పోర్చుగల్‌లోని అల్గార్వే ప్రాంతంలో ప్రారంభం కానున్న ఈ రైలు.. గమ్యస్థానమైన సింగపూర్‌ను చేరుకోవడానికి సుమారు 21 రోజుల సమయం పడుతుంది. వాతావరణ పరిస్థితులు, ఇతర ఊహించని ఆలస్యాల కారణంగా ఈ సమయం కొద్దిగా పెరగవచ్చు.


ఈ ప్రయాణంలో ఆ రైలు మొత్తం 13 దేశాల గుండా ప్రయాణం చేస్తుంది. మొత్తం మార్గంలో కేవలం 11 ప్రధాన స్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. పారిస్, మాస్కో, బీజింగ్, బ్యాంకాక్ వంటి ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన నగరాల్లోని స్టేషన్లలో ఈ రైలును రాత్రి మొత్తం నిలిపి ఉంచుతారు. దీంతో ప్రయాణికులు ఆయా నగరాలను దిగి చూసే అవకాశం కూడా ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక ఈ 21 రోజుల సుదీర్ఘ ప్రయాణానికి టికెట్ ధర సుమారుగా 1350 డాలర్లు అంటే మన భారత కరెన్సీలో సుమారు రూ.1.14 లక్షలుగా నిర్ణయించారు. ఇందులోనే భోజనం, డ్రింక్స్, వసతి సహా ప్రయాణానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను అందస్తారు. దీంతో ప్రయాణికులు ఎలాంట ఇబ్బందులు లేకుండా ప్రయాణాన్ని పూర్తిగా ఆస్వాదించవచ్చు.


ఐరోపా ఖండాన్ని ఆసియా ఖండంతో కలిపే ఈ రికార్డు సృష్టించడానికి లావోస్, చైనా మధ్య కొత్తగా ప్రారంభించిన రైలు లింక్ ప్రధాన కారణం అయింది. కొత్తగా నిర్మించిన లావోస్-చైనా లింక్ రైలు మార్గం చైనాలోని కున్మింగ్ నగరాన్ని లావోస్ రాజధాని వియెంటియాన్‌తో ప్రత్యక్షంగా కలుపుతుంది. ఈ చారిత్రక లింక్‌ను రూపొందించడంలో పాలుపంచుకున్న రైల్వే నిపుణులు, ట్రావెల్ ఔత్సాహికులు ఈ అద్భుతమైన మార్గాన్ని అభివృద్ధి చేశారు.


ఇక మన దేశంలో అత్యంత సుదీర్ఘమైన రైలు ప్రయాణం అస్సాంలోని డిబ్రూగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు సాగుతుంది. వివేక్ ఎక్స్‌ప్రెస్ రైలు.. 80 గంటల 15 నిమిషాలు ప్రయాణించి.. 4,273 కిలోమీటర్ల దూరాన్ని చేరుకుంటుంది. ఇక ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించాలనుకునేవారు ముందస్తు ప్రణాళిక వేసుకోవడంతోపాటు.. సంబంధిత పత్రాలను సిద్ధం చేసుకోవడం, రైలు కనెక్షన్లను తెలుసుకోవడం చాలా అవసరమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa