దాయాది దేశమైన పాకిస్థాన్లో ఉగ్రమూక మరోసారి రెచ్చిపోయి బీభత్సం సృష్టించింది. దేశంలోని వాయువ్య ప్రాంతంలో ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సును లక్ష్యంగా చేసుకుని.. అక్కడి పోలీసు శిక్షణా కేంద్రంపై శుక్రవారం రాత్రి ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ భయంకరమైన దాడిలో మొత్తం ఏడుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే దాడి అనంతరం భద్రతా సిబ్బంది, ఉగ్రవాదుల మధ్య జరిగిన హోరాహోరీ కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు.
ఈ దాడికి ప్రధాన లక్ష్యం డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని రట్టా కులాచి పోలీసు శిక్షణా పాఠశాల. శుక్రవారం రాత్రి పూట ఈ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు సృష్టించేలా ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పేలుడు పదార్థాలు నిండిన ఒక భారీ ట్రక్కును నేరుగా శిక్షణ పాఠశాల ప్రధాన ద్వారాన్ని ఢీ కొట్టేలా చేశారు. ట్రక్కు ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి అక్కడే విధులు నిర్వహిస్తున్న ఏడుగురు భద్రతా సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ చర్య ఉగ్రవాదులు భద్రతా సంస్థలపై ఎంతటి తీవ్రమైన పగతో ఉన్నారో స్పష్టం చేస్తోంది.
పేలుడు జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఈ ప్రతీకార కాల్పుల్లో మొదటగా ముగ్గురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. అయితే శిక్షణా కేంద్రం ఆవరణలో మరింత మంది ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో అధికారులు వెంటనే అదనపు బలగాలను రంగంలోకి దించారు. ఇలా దాదాపు ఐదు గంటల పాటు భద్రతా సిబ్బంది, దాక్కున్న ఉగ్రవాదుల మధ్య నిరంతరాయంగా ఎన్కౌంటర్ కొనసాగిది.
ఈ ఆపరేషన్లోమరో ముగ్గురు ఉగ్రవాదులు కూడా చనిపోయారు. ఇలా మొత్తంగా ఆరుగురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది చంపేశారు. అలాగే ఈ ఘటనలో మొత్తం 13 మంది పోలీసులు తీవ్రగా గాయపడ్డారు. ఇది గుర్తించిన అధికారులు వెంటనే వీరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పోలీసుల ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని అధికారులు వెల్లడించారు. చట్టాన్ని పరిరక్షించే కేంద్రాలపైనే ఉగ్రవాదులు లక్ష్యంగా దాడి చేయడాన్ని స్థానిక ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa