అగ్రరాజ్యం అమెరికాలో ఈమధ్య తరచుగా విషాదకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈమధ్య కాలంలో వెలుగు చూసిన కొన్ని దారుణాలను పరిశీలిస్తే.. విదేశాల నుంచి విద్య, ఉపాధి కోసం వచ్చిన వారికి అగ్రరాజ్యంలో రక్షణ కరువైందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇదిలా ఉంటే కొన్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అమెరికాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. యుద్ధ సామాగ్రి తయారు చేసే ప్లాంటులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 19 మంది మరణించినట్లు సమాచారం. మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.
అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో ఈ భారీ పేలుడు సంభవించింది. ఇక్కడి కాలమానం ప్రకారం.. శుక్రవారం ఉదయం 7.45 గంటలరే టెన్నెస్సీ రాష్ట్రంలోని అక్యురేట్ ఎనర్జిటిక్ సిస్టమ్స్ అనే సంస్థ కర్మాగారంలో ఉన్న మిలిటరీ యుద్ధసామగ్రి ప్లాంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం అనంతరం సుమారు 19 మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఇక పేలుడు ధాటికి సమీపంలో ఉన్న కార్లు ఎగిరి కిందకు పడ్డాయి. వాటికి మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. ప్రమాదం కారణంగా భారీ పేలుడు, మంటల సంభవించడంతో.. ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది.
ప్లాంట్లో చోటు చేసుకున్న పేలుడు శబ్దం కొన్ని మైళ్ల దూరం వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు. పేలుడు ధాటికి ప్లాంట్ సమీపంలోని ఇళ్లు, ఆ ప్రాంతంలో పార్క్ చేసిన వాహనాలు కదిలిపోయాయి. ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో ఈపేలుడుకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అయితే ప్లాంట్లో సంభవించిన పేలుడుకు సంబంధించి పూర్తి కారణాలు ఇంకా తెలియలేదని అధికారులు తెలిపారు.
పేలుడు గురించి సమాచారం అందిన వెంటనే.. ఎఫ్బీఐ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్లాంట్ లోపల మంటలు ఎగిసి పడుతుండటంతో.. సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. సిబ్బంది ప్లాంట్ లోపలికి వెళ్లలేకపోయారు. వెంటనే పేలుడుకు సంబంధించి దర్యాప్తు మొదలు పెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్లాంట్లో పేలుడు పదార్థాల తయారీ, నిర్వహణ, అభివృద్ధి పనులు జరుగుతుంటాయి.
అయితే పేలుడు జరిగిన సమయంలో ప్లాంట్లో చాలా మంది ఉన్నారని.. అయితే ఎంత మంది అనే వివరాలు తెలియదని అధికారులు తెలిపారు. గల్లంతైన వారు, మృతుల సంఖ్యకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం అధికారులు అక్కడ పని చేసే వారి కుటుంబ సభ్యులను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa