ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నోబెల్ శాంతి బహుమతిని తిరస్కరించిన ఏకైక వ్యక్తి.. ,,,చరిత్రలో ఒకే ఒక్కడు

international |  Suryaa Desk  | Published : Sat, Oct 11, 2025, 07:50 PM

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమై నోబెల్ బహుమతికి సంబంధించి ఈ సంవత్సరం ఆయా రంగాల్లో ఎవరు గెలిచారో కమిటీ ప్రకటిస్తూ వస్తోంది. అయితే ఈ సారి అందరి దృష్టి నోబెల్ శాంతి బహుమతి మీదే ఉంది. ఈ ఏడాది దీన్ని ఎవరికి ప్రకటిస్తారు అనే దానిపై పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొని ఉంది. అందుకు కారణం.. నోబెల్ శాంతి బహుమతి కోసం అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రేసులో నిలవడం.


తాను పలు దేశాల మధ్య తలెత్తిన యుద్ధాలను ఆపానని.. కనుకు తనకు తప్పకుండా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ట్రంప్ కోరుతూ వచ్చారు. అలానే పలు దేశాలతో తన పేరును సిఫారసు చేయించుకున్నారు. అయినా సరే ఆయనకు నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు. వీరంతా శాంతి బహుమతి కోసం ఇంతలా ఎదురు చూస్తుంటే.. ఒకరు మాత్రం నోబెల్ శాంతి బహుమతిని తిరస్కరించిన ఏకైక వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు. ఆయన ఎవరు.. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే..


2025 సంవత్సరానికి సంబంధించి.. వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి ఇస్తున్నట్లు కమిటీ ప్రకటించింది. ఇదిలా ఉంటే.. నోబెల్ శాంతి బహుమతిని తిరస్కరించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు వియత్నాంకు చెందిన విప్లవకారుడు, దౌత్యవేత్త, రాజకీయవేత్త అయిన లె డక్ థోను. నోబెల్ బహుమతుల చరిత్రలో శాంతి బహుమతిని తిరస్కరించిన ఏకైక వ్యక్తిగా థోను నిలిచిపోయారు.


ఫ్రాన్స్ ఓటమి తర్వాత వియత్నాం రెండుగా విభజించబడింది. ఉత్తర వియత్నాంలో కమ్యూనిస్టులు పాలనా పగ్గాలు చేపట్టగా.. దక్షిణ వియత్నాంలోని ప్రభుత్వానికి అమెరికాకు మద్దతిచ్చింది. కానీ ఉత్తర వియత్నాంలో కమ్యూనిస్టుల పాలనను చూసి... దాని చుట్టు పక్కల ఉన్న దేశాలు కూడా కమ్యూనిస్టు పాలననే కోరుకుంటాయన్న భయం మొదలైంది. దాంతో, అమెరికా వియత్నాంపై యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధం ముగింపులో లె డక్ థోను ఉత్తర వియత్నాం తరఫున కీలక పాత్ర పోషించారు.


ఈ క్రమంలో లె డక్ థో, అమెరికా విదేశాంగ కార్యదర్శి హెన్రీ కిస్సింజర్‌తో కలిసి 1973లో వియత్నాం యుద్ధం కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో నోబెల్ కమిటీ 1973 హెన్రీ కిస్సింజర్‌తో పాటుగా లె డక్ థోకు కూడా శాంతి బహుమతిని ప్రకటించింది. కానీ ఆయన దాన్ని తిరస్కరించారు. పారిస్ శాంతి ఒప్పందాలను పూర్తి స్థాయిలో గౌరవించి.. ఆమేరకు దక్షిణ వియత్నాంలో శాంతి పునరుద్ధరిస్తేనే.. తాను నోబెల్ శాంతి బహుమతిని స్వీకరించడాన్ని పరిశీలిస్తానని తెలుపుతూ.. లె డక్ నోబెల్ కమిటీకి టెలిగ్రామ్ పంపారు.


దక్షిణ వియత్నాంలో పారిస్ శాంతి ఒప్పందాల నిబంధనలను పూర్తి స్థాయిలో ఉల్లంఘిస్తున్నారని లె డక్ థో అభిప్రాయప్డారు. అమెరికా, దక్షిణ వియత్నాం దేశాల మధ్య నిరంతర శత్రుత్వం, సంఘర్షణ ఇంకా కొనసాగుతున్నాయని.. అక్కడ ఇంకా శాంతి ఏర్పడలేదని.. అలాంటప్పుడు శాంతి బహుమతిని ఎలా అంగీకరించాలని ఆయన ప్రశ్నించారు. అందుకే తాను నోబెల్ శాంతి పురస్కరాన్ని తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈక్రమంలో నోబెల్ అవార్డుల చరిత్రలో ఈ అవార్డు తిరస్కరించిన ఏకైక వ్యక్తిగా లె డక్ థో నిలిచిపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa