ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్ణాటక మంత్రివర్గ విస్తరణపై వస్తున్న వార్తలన్నీ వదంతులేనని స్పష్టీకరణ

national |  Suryaa Desk  | Published : Sat, Oct 11, 2025, 08:54 PM

కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ లేదా మార్పులపై గత కొద్ది రోజులుగా సాగుతున్న ప్రచారానికి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెరదించారు. అవన్నీ నిరాధారమైన వదంతులేనని, ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనేదీ లేదని ఆయన శనివారం స్పష్టం చేశారు. బెంగళూరులోని లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్‌లో జరిగిన 'బెంగళూరు వాక్' కార్యక్రమంలో ప్రజలతో ముచ్చటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు."ప్రస్తుతం కేబినెట్ విస్తరణ జరగడం లేదు. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కొన్ని మీడియా సంస్థలు వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు ప్రచురిస్తున్నాయి. ఇలాంటి ప్రతిపాదన ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి గానీ, నేను గానీ సూచించాలి. మేమిద్దరం అలాంటిదేమీ చెప్పనప్పుడు, అదంతా తప్పుడు ప్రచారమే అవుతుంది. ఏదైనా ఉంటే అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుంది" అని శివకుమార్ స్పష్టం చేశారు.డీకే శివకుమార్ మంత్రివర్గ విస్తరణ వార్తలను ఖండిస్తున్నప్పటికీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అక్టోబర్ 13న కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోసం ప్రత్యేకంగా విందు సమావేశం ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. బీహార్ ఎన్నికల తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని సీఎం సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు, వాల్మీకి జయంతి వేడుకల్లో మాట్లాడిన సిద్ధరామయ్య, తదుపరి పునర్వ్యవస్థీకరణలో వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నేతకు తప్పకుండా మంత్రి పదవి ఇస్తామని హామీ ఇవ్వడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. అయితే, రాబోయే మున్సిపల్, జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికలపై చర్చించేందుకే సీఎం విందు సమావేశం ఏర్పాటు చేశారని శివకుమార్ అంటున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa