విశాఖఫట్నంలో సంచలనం రేపిన దోపిడీ కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితులు ఎవరో తెలిసి అందరూ షాకయ్యారు. ఈ మేరకు కంచరపాలెం పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి దొంగిలించిన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణకాంత్ తన స్నేహితులతో కలిసి.. తన తండ్రి హైదరాబాద్ వెళ్లిన సమయంలో సొంత ఇంట్లోనే చోరీకి తెగబడ్డాడు. ఆన్లైన్ ట్రేడింగ్లో భారీగా నష్టపోయి అప్పుల్లో కూరుకుపోయిన కృష్ణకాంత్, అప్పులు తీర్చడానికి ఈ దొంగతనం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.. నగర సీపీ శంఖబ్రత బాగ్చీ ఈ వివరాలను వెల్లడించారు.
విశాఖపట్నం కంచరపాలెం ఇందిరానగర్లో నివాసముంటున్న ధర్మాల ఆనందరెడ్డి జీవీఎంసీలో కాంట్రాక్టు పనులు చేస్తుంటారు. ఆయన కుమారుడు కృష్ణకాంత్ తండ్రిలా పెద్ద వ్యాపారం చేసి ఎదగాలనే ఆశతో ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడులు పెట్టి భారీగా నష్టపోయాడు. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన కృష్ణకాంత్, అప్పులు తీర్చడానికి ఒక మార్గం వెతుకుతూ, చివరికి తన ఇంట్లోనే దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 4వ తేదీన తండ్రి ఆనందరెడ్డి ఒక శుభకార్యం కోసం హైదరాబాద్ వెళ్లడంతో, కృష్ణకాంత్ తన స్నేహితులైన పరపతి ప్రమోద్కుమార్, షేక్ అభిషేక్, అవసరాల సత్యసూర్యకుమార్తో కలిసి ఈ దొంగతనం చేయడానికి స్కెచ్ వేశాడు.
ముందుగా అనుకున్న ప్రకారం.. కృష్ణకాంత్ తన తండ్రి హైదరాబాద్ వెళ్లిన మరుసటి రోజు అంటే అక్టోబర్ 5న రాత్రి ప్లాన్ అమలు చేశాడు. కృష్ణకాంత్ ముగ్గురు స్నేహితులు ముఖాలకు మాస్క్లు ధరించి ఇంట్లోకి చొరబడ్డారు. వెంటనే ఆనందరెడ్డి తల్లి ఎల్లమ్మతో పాటుగా కృష్ణకాంత్ కాళ్లు, చేతులు కట్టేశారు.. వారిని గుర్తుపట్టకుండా ముఖాలకు ప్లాస్టిక్ టేపు చుట్టేశారు. అలాగే దోపిడీ దొంగలుగా నమ్మించేందుకు.. ఇతర రాష్ట్రాలకు చెందినవారిగా బిల్డప్ ఇచ్చారు.. ముగ్గురూ హిందీలో మాట్లాడుకున్నారు. వారిని కట్టేసిన తర్వాత నేరుగా వెళ్లి ఇంట్లోని బీరువాలోని బంగారు, డబ్బులు తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చి కారులో పారిపోయారు.
ఈ ముగ్గురు గ్యాంగ్ మారికవలస దగ్గర కారు వదిలేసి.. అక్కడి నుంచి ఆటోలో ఆర్టీసీ కాంప్లెక్సుకు వెళ్లారు. అక్కడి నుంచి బయల్దేరి ముందు విజయవాడ వెళ్లారు.. అక్కడి నుంచి హైదరాబాద్కు ముగ్గురు పారిపోయారు. ఆ తర్వాత కృష్ణకాంత్ ఈ చోరీకి తనకు ఏం సంబంధం లేదనట్లుగా నటించాడు. ఏం తెలియనట్లుగా బిల్డప్ ఇస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. కృష్ణకాంత్ ప్రధాన నిందితుడని ని గుర్తించారు. ముగ్గురు స్నేహితుల్ని అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుంచి రూ.2.10 లక్షల డబ్బులు, బంగారం, కారు స్వాధీనం చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa