ట్రెండింగ్
Epaper    English    தமிழ்

177 రన్స్ చేసి రనౌట్‌,,,,డబుల్ సెంచరీ మిస్ చేసుకున్న జైశ్వాల్

sports |  Suryaa Desk  | Published : Sat, Oct 11, 2025, 09:04 PM

వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెన‌ర్ య‌శ‌స్వి జైశ్వాల్ డ‌బుల్ సెంచ‌రీ చేసే అవ‌కాశాన్ని కోల్పోయాడు. ఢిల్లీ వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్ రెండో రోజు తొలి సెషన్‌లో 175 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. ఓవర్ నైట్ స్కోరు 173తో రెండో రోజు ఆట ప్రారంభించి అతడు.. మరో రెండు పరుగులు మాత్రమే జోడించి ఔట్ అయ్యాడు. ఫుల్ అండ్ ఆఫ్‌లో ప‌డిన బంతిని జైశ్వాల్ మిడాఫ్ దిశ‌గా డ్రైవ్ చేశాడు. నాన్ స్ట్రైక‌ర్ ఎండ్‌లో ఉన్న శుభ్‌మ‌న్ గిల్ ప‌రుగు కోసం ముందుకు రాలేదు. కానీ జైశూ మాత్రం సగం క్రీజు వ‌ర‌కు వెళ్లాడు.


ఇది గమనించిన జైశ్వాల్.. మ‌ళ్లీ క్రీజ్‌లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించినా లాభం లేకుండాపోయింది. అక్క‌డ ఫీల్డింగ్ చేస్తున్న చంద‌ర్‌పాల్ ఆ బంతిని అందుకుని కీప‌ర్ దిశ‌గా విసిరేశాడు. దీంతో జైశ్వాల్ డబుల్ సెంచరీకి ముందు పెవిలియన్ చేరిపోయాడు. విండీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న అతడు.. చేయని తప్పుకు ఔట్ అయ్యాడు. దీంతో నిరాశగా పెవిలియన్ దిశగా నడిచాడు. తలబాదుకుంటూ.. అసంతృప్తి వ్యక్తం చేశాడు. జైశ్వాల్ రనౌట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇక శుభ్‌మన్ గిల్ కారణంగా జైశూ.. డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జైశ్వాల్ డబుల్ సెంచరీ చేసేందుకు అర్హుడని పేర్కొంటున్నారు. మరోవైపు కామెంటేటర్లు మాత్రం అనసవర పరుగుకు ప్రయత్నించి అతడు మూల్యం చెల్లించుకున్నాడని అభిప్రాయ పడుతున్నారు. బంతిని చూస్తూ పరుగెత్తాలనేది బేసిక్ రూల్ అని, గిల్ అదే చేశాడని.. జైశ్వాల్ రనౌట్ విషయంలో అతడి తప్పేమీ లేదన్నారు.


ఇక భారత్ తరఫున టెస్టుల్లో సెంచరీ చేశాక రనౌట్ అయిన భారత ప్లేయర్‌గానూ జైశ్వాల్ నిలిచాడు. సంజయ్ మంజ్రేకర్ 218 రన్స్ చేసి రనౌట్ అయ్యాడు. రాహుల్ ద్రవిడ్ 217, 180 పరుగుల వద్ద రనౌట్ రూపంలో పెవిలియన్ చేరిపోయాడు. ఈ జాబితాలో జైశ్వాల్ సైతం చేరిపోయాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa