ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో రూ.1 లక్ష కోట్లతో 'టీసీఎస్' డేటా సెంటర్.. వేలాది మందికి ఐటీ ఉద్యోగాలు

business |  Suryaa Desk  | Published : Sat, Oct 11, 2025, 09:05 PM

ఆంధ్రప్రదేశ్ వాణిజ్య నగరం విశాఖపట్నంలో మరో కలికితురాయి చేరనుంది. ఏకంగా రూ.1 లక్ష కోట్లతో టాటా గ్రూప్ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. లక్ష కోట్లను దశల వారీగా పెట్టుబడు పెట్టాలని నిర్ణయించింది. ఈ కంపెనీ విశాఖపట్నంలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్‌ను నవంబర్ నెలలో ప్రారంభించనుంది. ఈ సమయంలోనే డేటా సెంటర్ ఏర్పాటుపై అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే టీసీఎస్ ఛైర్మన్ చంద్రశేఖరన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో కలిసి డేటా కేంద్రం ఏర్పాటుపై చర్చించినట్లు అధికారులు తెలిపారు.


వచ్చే రెండేళ్లలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలు వైజాగ్‌లో రూ.2.60 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా ప్రత్యక్ష ఉపాధి కంటే వాటికి అనుబంధంగా ఏర్పాటయ్యే కంపెనీల నుంచి పది రెట్లకు పైగా పరోక్ష ఉపాధి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. డేటా కేంద్రాల ఏర్పాటుతో వైజాన్ నగరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూపు దిద్దుకోనుంది. డేటా కేంద్రాలను కేంద్రంగా చేసుకుని ఏఐ స్టార్టప్ కంపెనీలు, ఏఐ ఆధారిత సంస్థలు వైజాగ్‌కి వస్తాయని చెబుతున్నారు. అలాగే డేటా కేంద్రాలు అందుబాటులోకి వచ్చినట్లయితే హైస్పీడ్ కంప్యూటింగ్, యానిమేషన్, గేమింగ్, ఏఐ క్లౌడ్ వంటి రంగాలు అభివృద్ధి చెందుతాయంటున్నారు. అలాగే ఆయా రంగాల్లోని పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఏర్పాడుతుంది. గూగుల్, కాగ్నిజెంట్, మెటా, టీసీఎస్ వంటి కంపెనీలు ఇప్పటికే వైజాగ్ నుంచి తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రభుత్వంతో ఒప్పందాలు సైతం చేసుకున్నాయి.


అమెరికా బయట రూ.56 వేల కోట్లతో అతిపెద్ద డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు గూగుల్ కంపెనీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంగీకారం తెలిపింది. నవంబర్ నెలలోనే ఈ ఒప్పందం కుదరనుందని సమాచారం. ఇక గూగుల్ అనుబంధ కంపెనీ రైడన్ ఇన్ఫోటెక్ ఇండియా రూ.87,520 కోట్లతో 1000 మెగావాట్ల డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందట. అక్టోబర్ 10వ తేదీన జరిగిన ఏపీ మంత్రిమండలి సమావేశంలో ఈ సంస్థ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఇక సీపీ టెక్నాలజీస్ రూ.16 వేల కోట్ల పెట్టుబడులతో డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.


వేలాది మందికి ఉపాధి..


టీసీఎస్ వైజాగ్‌లో ఏర్పాటు చేసే డెవల్మెంట్ కేంద్రం ద్వారా రూ.1400 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో 12 వేల మందికి ఉపాధి లభించనుంది. సొంత క్యాంపస్ కోసం ప్రభుత్వం 22 ఎకరాలు అందించింది. ఇదే తరహాలో కాగ్నిజెంట్, యాక్సెంచర్ కంపెనీలు మరో 25 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నాయి. వీటితో పాటుగా సత్వా, ఏఎంఎన్ఎస్ కంపెనీలు మరో 15 వేల మందికి ఐటీ ఉద్యోగాలు కల్పించనున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.


మరోవైపు.. ఎన్టీపీసీ రూ.2 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ అభివృద్ధి చేస్తోంది. ఆర్సెలార్ మిట్టల్ కంపెనీ రూ.1.30 వేల కోట్లతో స్టీల్ పరిశ్రమ, క్యాప్టివ్ పోర్టు అభివృద్ధి చేస్తోంది. డేటా కేంద్రాల ఏర్పాటు ద్వారా పెట్టుబడులతో గత 15 నెలల్లోనే విశాఖకు రూ.6 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa