ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అర్ధరాత్రి ఆమె బయటకు ఎందుకు వచ్చింది? గ్యాంగ్‌రేప్‌‌పై మమతా బెనర్జీ

national |  Suryaa Desk  | Published : Sun, Oct 12, 2025, 04:40 PM

పశ్చిమ్ బెంగాల్‌లో మరో వైద్య విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. దుర్గాపూర్‌‌లో ప్రయివేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతోన్న 23 ఏళ్ల విద్యార్థిని శుక్రవారం రాత్రి తన స్నేహితుడితో ఉండగా.. ముగ్గురు యువకులు అతడ్ని బెదిరించి ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటనపై బెంగాల్‌తో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఘటనపై బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తొలిసారి స్పందించారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఆమె బయటకు ఎందుకు వెళ్లారని దీదీ ప్రశ్నించారు. ప్రయివేట్ కాలేజీల్లో విద్యార్థుల భద్రత పూర్తిగా యాజమాన్యాలే వహించాలని పరోక్షంగా స్పష్టం చేశారు.


‘ఆమె ప్రయివేట్ మెడికల్ కాలేజీలో చదువుతోంది.. ఆమె అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో బయటకు వెళ్తే దీనికి బాధ్యత ఎవరిది?’ అని నిలదీశారు. ఈ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందన్న సీఎం మమత.. బెంగాల్ పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రయివేట్ మెడికల్ కాలేజీలు తమ విద్యార్థుల భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని, రాత్రి సమయంలో వారు బయటకు వెళ్లే విషయంలో పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. ‘విద్యార్థులను బయటకు రావడానికి అనుమతించవద్దు’ అని బెనర్జీ అన్నారు.


ఒడిశాలోని జలేశ్వర్‌‌కు చెందిన బాధిత యువతి... దుర్గాపూర్‌లోని ఐక్యూ సిటీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ రెండో ఏడాది చదువుతోంది. శుక్రవారం రోజు రాత్రి ఆమె తన స్నేహితుడితో కలిసి క్యాంపస్ నుంచి బయటికి వెళ్లింది. క్యాంపస్ గేటుకు సమీపంలో వాళ్లు ఉండగానే.. గుర్తుతెలియని ముగ్గురు యువకులు వారిని అడ్డుకున్నారు. ఆమె స్నేహితుడ్ని బెదిరించి అక్కడి నుంచి పంపేశారు. అనంతరం ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె మొబైల్ ఫోన్, పర్సులో ఉన్న రూ.5 వేల నగదును తీసుకుని పరారయ్యారు. ఈ ఘటనపై బాధితురాలు చెప్పిన వివరాలు ఆధారంగా ముగ్గురు అనుమానితులను బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో పీజీ రెసిడెంట్ డాక్టర్ హత్యాచార ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. అలాగే, ఈ ఏడాది జులైలో లో కస్బాలోని ఓ లా కాలేజీ ప్రాంగణంలో న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది.


తరుచూ బెంగాల్‌లో ఇటువంటి ఘటనలు ఆ రాష్ట్రంలో మహిళల భద్రతపై అనేక సందేహాలు లేవనెత్తుతున్నాయి. మహిళా ముఖ్యమంత్రి ఉన్నా.. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ.. దీదీ సర్కారుపై ఒంటికాలితో లేస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా.. బీజేపీ తన ప్రచార అస్త్రంగా మలచుకునే ఉద్దేశంలో ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa