ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్-తాలిబాన్ స్నేహంపై పాక్ ఆగ్రహం.. అఫ్గాన్ రాయబారికి సమన్లు, కశ్మీర్ ప్రస్తావనే కారణం

international |  Suryaa Desk  | Published : Sun, Oct 12, 2025, 04:44 PM

భారతదేశ పర్యటనలో ఉన్న అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ, భారత ప్రభుత్వం కలిసి విడుదల చేసిన సంయుక్త ప్రకటనపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఢిల్లీలో జరిగిన చర్చల అనంతరం విడుదలైన ప్రకటనలో జమ్మూ కాశ్మీర్‌పై ఉన్న అంశాలు, ఉగ్రవాదంపై అఫ్గాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ నొచ్చుకుంది. ఈ మేరకు పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం శనివారం నాడు అఫ్గాన్ రాయబారిని పిలిచి తన నిరసనను వ్యక్తం చేస్తూనే.. అఫ్గాన్ రాయబారికి సమన్లు జారీ చేసింది.


అఫ్గాన్ విదేశాంగ మంత్రి ముత్తఖీ ఆరు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఢిల్లీకి వచ్చారు. ఇరు దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో.. అఫ్గానిస్థాన్ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించింది. అలాగే ప్రాంతీయ దేశాల ఉగ్రవాద చర్యలను ఉమ్మడిగా ఖండిస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు. అయితే జమ్మూ కాశ్మీర్‌ను భారత దేశంలో అంతర్భాగంగా పేర్కొనడాన్ని పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. జమ్మూ కాశ్మీర్ గురించి చేసిన ఈ ప్రస్తావన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని అఫ్గాన్ రాయబారితో పాక్ విదేశాంగ కార్యాలయం పేర్కొంది. ఈ వ్యాఖ్యలను తాము పూర్తిగా తిరస్కరిస్తున్నామని స్పష్టం చేసింది.


సంయుక్త ప్రకటనలోని అంశాలతో పాటు, ఉగ్రవాదం అనేది పాకిస్థాన్ అంతర్గత సమస్య అంటూ అఫ్గాన్ మంత్రి ముత్తఖీ చేసిన వ్యాఖ్యలను కూడా ఇస్లామాబాద్ ఖండించింది. ఉగ్రవాదాన్ని అరికట్టే బాధ్యతను పాకిస్థాన్‌పై నెట్టడంతో పాటు శాంతిని, స్థిరత్వాన్ని భద్రపరచాల్సిన అఫ్గాన్ బాధ్యత తీరిపోదని పాక్ పేర్కొంది. తమ భూభాగాన్ని ఉగ్రవాద శక్తులు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఉపయోగించకుండా అఫ్గాన్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నట్లు పాకిస్థాన్ నొక్కి చెప్పింది.


దశాబ్దాలుగా దాదాపు 40 లక్షల మంది అఫ్గాన్ పౌరులకు తమ దేశంలో ఆతిథ్యం ఇచ్చినట్లు పాక్ గుర్తు చేసింది. అఫ్గానిస్థాన్‌లో శాంతి నెలకొన్నందున సరైన అనుమతులు లేకుండా తమ దేశంలో నివసిస్తున్న అఫ్గాన్ జాతీయులు తిరిగి సొంత గడ్డకు వెళ్లాలని పాకిస్థాన్ పునరుద్ఘాటించింది. అన్ని ఇతర దేశాల మాదిరిగానే తమ భూభాగంలో నివసిస్తున్న విదేశీయుల ఉనికిని నియంత్రించే హక్కు తమకు ఉందని పాకిస్థాన్ తన ప్రకటనలో తెలిపింది. అయినప్పటికీ ఇస్లామిక్ సోదర భావంతో అఫ్గాన్ పౌరులకు విద్య, వైద్య వీసాలను జారీ చేయడాన్ని కొనసాగిస్తున్నట్లు పాకిస్థాన్ వివరించింది. ప్రాంతీయ అనుసంధానాన్ని, ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉన్నప్పటికీ.. తమ ప్రజల భద్రతకు భరోసా ఇవ్వడం తమ ప్రధాన కర్తవ్యమని పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం స్పష్టం చేసింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa