ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యుద్ధం తప్పదా,,,?,,,రణరంగంగా మారిన పాకిస్థాన్-అఫ్ఘానిస్థాన్ సరిహద్దు

international |  Suryaa Desk  | Published : Sun, Oct 12, 2025, 04:47 PM

 పాకిస్థాన్ - అఫ్గానిస్థాన్ సరిహద్దు మరోసారి రణరంగంగా మారింది. ఎంతో కాలంగా అశాంతికి నిలయంగా మారిన ఈ తూర్పు సరిహద్దు ప్రాంతంలో పాకిస్థాన్ వైమానిక దాడులకు ప్రతీకారంగా తమ దళాలు ఎదురుదాడికి దిగాయని అఫ్గానిస్థాన్ పాలకవర్గమైన తాలిబాన్ ప్రకటించింది. కునార్ నుండి హెల్మండ్ వరకు.. దశాబ్దాలుగా యుద్ధాల అంచున ఉన్న ఈ సరిహద్దు ప్రావిన్సుల్లో ఘర్షణలు తీవ్రంగా కొనసాగుతున్నాయని స్థానిక అధికారులు ధృవీకరించారు.


పాకిస్థాన్ తన భూభాగంపై వైమానిక దాడులు చేసిందని ఆరోపిస్తూ.. శనివారం నాడు అఫ్గానిస్థాన్ తాలిబాన్ దళాలు సరిహద్దు వెంబడి పాకిస్థాన్ సైనికులపై సాయుధ దాడులకు దిగాయి. ఈ విషయాన్ని పలు ప్రావిన్సుల నుంచి వచ్చిన సీనియర్ అధికారులు ధృవీకరించారు. పాకిస్థాన్ బలగాలు చేసిన వైమానిక దాడులకు ప్రతీకారంగా తూర్పున ఉన్న తాలిబాన్ సరిహద్దు దళాలు వివిధ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పాకిస్థాన్ బలగాల పోస్టులపై తీవ్ర ఘర్షణలకు దిగాయని అఫ్గాన్ మిలటరీ ఒక ప్రకటనలో పేర్కొంది.


గురువారం నాడు అఫ్గాన్ రాజధాని కాబూల్‌లో రెండు పేలుళ్లు, దేశానికి ఆగ్నేయ దిశలో మరొక బాంబు దాడి జరిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజు తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దాడులకు పాకిస్థాన్‌ను బాధ్యుల్ని చేస్తూ,.. తమ పొరుగు దేశం "దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించిందని" ఆరోపించింది. తర్వాత తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎనాయత్ ఖోవరాజమ్ మాట్లాడుతూ.. ఈ దాడులు అర్ధరాత్రి సమయానికి ముగిశాయని తెలిపారు. పాకిస్థాన్ మరోసారి ఇలాంటి దాడులకు పాల్పడితే తమ సాయుధ దళాలు దీటుగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ ప్రకటించారు.


అయితే అప్ఘానిస్థాన్‌పై దాడులు చేసినట్లు పాకిస్థాన్ ఇప్పటి వరకు ప్రకటించుకోలేదు. కానీ టీటీపీ మిలిటెంట్లకు ఆశ్రయం ఇవ్వడాన్ని కాబూల్ మానుకోవాలని పాకిస్థాన్ డిమాండ్ చేసింది. అఫ్గాన్ తాలిబాన్‌ భావజాలాన్ని కలిగి ఉన్న, అఫ్గానిస్థాన్‌లో యుద్ధ శిక్షణ పొందిన టీటీపీ మిలిటెంట్లు.. 2021 నుండి తమ వందలాది మంది సైనికులను చంపిందని ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది.


పాక్ - అఫ్గాన్ సరిహద్దుల వెంట నాలుగు పాయింట్లలో మొదట చిన్న ఆయుధాలతో, ఆ తర్వాత భారీ ఫిరంగులతో కాల్పులు జరిపినట్లు పాకిస్థాన్‌లోని ఖైబర్-ఫఖ్తుంంఖ్వా ప్రావిన్స్‌కు చెందిన అధికారి ధ్రువీకరించారు. పేలుడు పదార్థాలను కలిగి ఉన్న మూడు అఫ్గాన్ క్వాడ్‌కాప్టర్లను కూల్చివేసినట్లు తెలిపారు. ఇరువైపుల నుంచి పోరాటం తీవ్రంగా సాగుతున్నట్లు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ పర్వత ప్రాంతాల్లోని పాకిస్థాన్ భద్రతా దళాలపై టీటీపీ మిలిటెంట్లు దాడులు తీవ్రం చేశారు. తమ భూభాగాన్ని ఉపయోగించుకొని పాకిస్థాన్‌పై దాడులు చేస్తున్నారని, ఆ మిలిటెంట్లను నియంత్రించడంలో అఫ్గాన్ విఫలమవుతోందని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. అయితే పాకిస్థాన్ ఆరోపణలను కాబూల్‌లోని అధికారులు ఖండించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa