ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 06:28 PM

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగ అభివృద్ధిలో నవంబర్ నెల కీలకంగా మారనుంది. నవ్యాంధ్రకు పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. దీంతో దిగ్జజ సంస్థల చూపు ఏపీ వైపు మళ్లుతోంది. ఈ క్రమంలోనే ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థలు గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అందులో కొన్ని ప్రాజెక్టులు వేగంగా అడుగులు పడుతున్నాయి కూడా. అయితే నవంబర్ నెల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దశ, దిశను మార్చేలా కనిపిస్తోంది. రెండు కీలక ప్రాజెక్టులకు నవంబర్ నెలలో శ్రీకారం చుట్టనున్నారు. విశాఖపట్నంలో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు అన్నింటికంటే ముుందుగా ఆసక్తి చూపించింది టీసీఎస్.. ఆ తర్వాతనే ఒక్కొక్క కంపెనీ ఏపీవైపు, అందులోనూ విశాఖవైపు దృష్టి సారిస్తూ వచ్చాయి. ఈ క్రమంలోనే నవంబర్ నెలలో టీసీఎస్ తన కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.


తొలి అడుగు టీసీఎస్‌దే.. నవంబర్ నుంచి పనులు..


విశాఖపట్నంలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతో తొలుత ఒప్పందం చేసుకున్నది కూడా టీసీఎస్ కావటం విశేషం. ఇక టీసీఎస్ కోసం రుషికొండ సమీపంలోని ఐటీహిల్స్‌పై భవనాన్ని కూడా ఏపీ ప్రభుత్వం కేటాయించింది. హిల్‌-3లోని మిలీనియం టవర్స్‌ లీజు ప్రాతిపదికన కేటాయించింది. ఈ భవనంలో ఉద్యోగులు పనిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ ఏర్పాట్లు కూడా తుది దశకు చేరుకున్నాయి. నవంబర్ నెలలో విశాఖ వేదికగా టీసీఎస్ కార్యకలాపాలు మొదలుపెట్టనుంది. ఈ విషయాన్ని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా తెలిపారు.


టీసీఎస్ క్యాంపస్‌లో తొలిదశలో 2 షిఫ్టులలో 2000 మంది ఉద్యోగులు పనిచేస్తారు. ఆ తర్వాత ఉద్యోగుల సంఖ్యను క్రమంగా ఆరు వేలకు పెంచాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకు తగ్గట్లుగా మిలీనయం టవర్స్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ భవనం నుంచి తాత్కాళికంగా కార్యకలాపాలు సాగిస్తూనే.. టీసీఎస్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. రూ.1,370 కోట్లతో 12000 మందికి ఉపాధి కల్పించనుంది. టీసీఎస్ క్యాంపస్ కోసం ఏపీ ప్రభుత్వం ఐటీహిల్‌-3పై 22 ఎకరాలను కేటాయించింది. ఎకరా 99 పైసలకు చొప్పున కేటాయింపులు చేశారు.


 టీసీఎస్ బాటలో కాగ్నిజెంట్..


మరోవైపు టీసీఎస్ బాటలోనే మరో ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ కూడా విశాఖలో పెట్టుబడులు పెట్టనుంది. రూ.1,582 కోట్లతో విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. కాగ్నిజెంట్ క్యాంపస్ ద్వారా సుమారుగా 8000 మందికి ఉద్యోగాలు రానున్నాయి.. ఈ నేపథ్యంలో కాగ్నిజెంట్ సంస్థకు కూడా ఎకరా భూమి 99 పైసలకు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాపులుప్పాడ వద్ద 21.31 ఎకరాల భూమి కేటాయించింది. మరోవైపు కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సీఈవో రవి కుమార్ వచ్చే నవంబర్‌లోనే విశాఖపట్నం పర్యటించనున్నారు. ఈ పర్యటనలోనే ఆయన విశాఖ కాగ్నిజెంట్ క్యాంపస్ ప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇవి కాకుండా గూగుల్ డేటా సెంటర్.. రూ.లక్ష కోట్లతో టీసీఎస్ డేటా సెంటర్‌ ఏర్పాటు కానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa