ట్రెండింగ్
Epaper    English    தமிழ்

48 ఏళ్ల చరిత్రలో తొలిసారి భారత మహిళకు కిరీటం,,,మిసెస్ యూనివర్స్ 2025 గా షెర్రీ సింగ్

international |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 07:49 PM

భారతదేశానికి చెందిన షెర్రీ సింగ్ ప్రతిష్ఠాత్మకమైన మిసెస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించారు. 48 ఏళ్లుగా సాగుతున్న ఈ పోటీలో ఈ మిసెస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలిగా షెర్రీ సింగ్ చరిత్ర సృష్టించారు. ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో జరిగిన 48వ ఎడిషన్ మిసెస్ యూనివర్స్ పోటీల్లో షెర్రీ సింగ్ ఈ ఘనత సాధించారు. ఇక ఈ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి మొత్తం 120 మందికి పైగా మహిళలు పోటీ పడ్డారు.


9 ఏళ్ల క్రితం షెర్రీ సింగ్‌కు వివాహం కాగా.. ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. తనకు మిసెస్ యూనివర్స్ కిరీటం దక్కడంపై ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ విజయం తన ఒక్కదానిది మాత్రమే కాదని.. తమ పరిస్థితులను దాటుకుని.. కలలు కనడానికి సాహసం చేసే ప్రతీ మహిళకు ఈ విజయం అంకితమని పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసం, బలం, దయ అనేవి నిజమైన అందాన్ని నిర్వచిస్తాయని తాను ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నానని షెర్రీ సింగ్.. ఉమెన్ ఫిట్‌నెస్ ఇండియాకు తెలిపారు. ఇక మిసెస్ యూనివర్స్ 2025 విజేతగా షెర్రీ సింగ్ పేరును ప్రకటించినప్పుడు ఆమె కన్నీళ్లను ఆపుకోలేకపోయారు.


షెర్రీ సింగ్ మిసెస్ యూనివర్స్ కిరీటం సాధించడంపై ఆమె మెంటర్, నేషనల్ డైరెక్టర్ ఊర్మిమాలా బోరువా స్పందించారు. తాము ఎల్లప్పుడూ షెర్రీ సింగ్ సామర్థ్యం పట్ల విశ్వాసం ఉంచామని.. ఆమె సాధించిన చారిత్రక విజయం భారత్‌కు గర్వకారణమని పేర్కొన్నారు. తన దేశానికి గౌరవంగా, ఆత్మవిశ్వాసంతో ప్రాతినిధ్యం వహించాలనుకునే ప్రతీ మహిళకు షెర్రీ సింగ్ ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేసిందని ప్రశంసలు గుప్పించారు. 48 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. మిసెస్ యూనివర్స్ కిరీటం చివరికి ఇంటికి తిరిగి వచ్చిందని యూఎంబీ పేజెంట్స్ ఒక ప్రకటనలో తెలిపింది.


ఇక ఈ పోటీలో విజేతలుగా గుర్తించడానికి గ్రాండ్ ఫినాలేలో కేవలం బాహ్య సౌందర్యానికి మాత్రమే కాకుండా తెలివితేటలు, కరుణ, సామాజిక బాధ్యతలకు కూడా జ్యూరీ సమాన ప్రాధాన్యం ఇచ్చింది. షెర్రీ సింగ్ చాలా ఏళ్లుగా పేద నేపథ్యం నుంచి వచ్చిన బాలికల విద్యకు మద్దతు ఇచ్చే అనేక సంస్థలతో కలిసి పనిచేశారు. అదే సమయంలో మానసిక ఆరోగ్యం, భావోద్వేగ శ్రేయస్సు కోసం నిత్యం కృషి చేస్తూనే ఉన్నారు. మరోవైపు.. షెర్రీ సింగ్ ఫ్యాషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అంతేకాకుండా.. ఆమె గతంలో జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ ప్లేయర్. వీటన్నింటికీ తోడు ఫిట్‌నెస్ పట్ల షెర్రీ సింగ్ చాలా ఇష్టం ఉన్న వ్యక్తి. ఇక తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో షెర్రీ సింగ్.. ఫ్యాషన్, ఫిట్‌నెస్ చిట్కాలు, ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన అంశాలను తన ఫాలోవర్స్‌తో షేర్ చేసుకుంటారు. శ్రీకృష్ణుని భక్తురాలిగా.. ఆమె తరచూ తన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి వివరాలు వెల్లడిస్తారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa