ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పాకిస్థాన్లో గతవారం మొదలైన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముస్లిం అతివాద పార్టీ ర్యాలీని అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగి, ఓ పోలీస్ అధికారి సహా పలువురు ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు. రాజధాని ఇస్లామాబాద్వైపు తెహ్రిక్ ఇ లబ్బాయిక్ పాకిస్థాన్ (టీఎల్పీ) కార్యకర్తలు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై నిరసనకారులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారి చనిపోగా, పలువురు గాయపడ్డారు. పరిస్థితి అదుపుతప్పడంతో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు కాల్పుల జరిపినట్టు అధికారులు తెలిపారు. అయితే, ఈ ఘటనలో నిరసనకారులు ఎంతమంది చనిపోయారు అనేది మాత్రం వెల్లడించలేదు. కానీ, టీఎల్పీ మాత్రం తమ కార్యకర్తలు చాలా మందికి గాయాలైనట్టు పలువురు చనిపోయినట్టు పేర్కొంది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం జరిగి గాజాలో యుద్ధం ముగిసినా.. దానిపైనే పాక్లో చేపట్టిన ఆందోలనలు హింసాత్మకంగా మారడం గమనార్హం.
పోలీసుల కాల్పుల్లో గాయపడినవారిలో తమ పార్టీ అధ్యక్షుడు సాద్ రిజ్వీ ఉన్నారని, ఆయన శరీరంలోకి పలు బుల్లెట్లు దూసుకెళ్లాయని, ఆయన పరిస్థితి విషమంగా ఉందని టీఎల్పీ తెలిపింది. ఆయనపై కాల్పులు జరగడానికి కొద్దిసేపటి ముందే సోషల్ మీడియాలో రిజ్వీ వీడియోను టీఎల్పీ షేర్ చేసింది. ఫైరింగ్ ఆపాలని భద్రతా బలగాలను కోరుతున్న ఆయన.. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పడం వీడియోలో రికార్డయ్యింది. మద్దతుదారులను ఉద్దేశించి రిజ్వీ మాట్లాడుతున్న సమయంలో తుపాకి కాల్పుల శబ్దాలు వెనుక నుంచి వినిపిస్తున్నాయి.
అలాగే, టీఎల్పీ కార్యకర్తలను తీసుకెళ్తున్న ట్రక్ సహా పలు వాహనాలు మంటల్లో దగ్దమవుతోన్న మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తూర్పు పాకిస్థాన్లో తెహ్రిక్ ఇ లబ్బాయిక్ పాకిస్థాన్ పార్టీ ‘లాంగ్ మార్చ్’తో శుక్రవారం ఆందోళనలు ప్రారంభించింది. ఈ మార్చ్ను పోలీసులు అడ్డుకోవడం ఘర్షణకు దారితీసింది. శనివారం 100 మందికిపైగా నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
రాజధాని ఇస్లామాబాద్లోని అమెరికా రాయబార కార్యాలయం ఎదుట పాలస్తీనాకు మద్దతుగా ర్యాలీ నిర్వహించాలనే ఉద్దేశంతో లాంగ్ మార్చ్కు పిలుపునిచ్చారు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు చర్యలు చేపట్టడంతో వారిపైనే కాల్పులు జరిపారు. సోమవారం జరిగిన ఘర్షణల్లో రోడ్లకు అడ్డంగా పోలీసులు పెట్టిన కంటెయినర్లను తొలగించడానికి ఆందోళనకారులు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు ఘర్షణ జరిగింది. తర్వాత మురిద్కే పట్టణంలో శిబిరం ఏర్పాటుచేసి ఆందోళన కొనసాగిస్తున్నారు.
విధ్వంసం, హింసాత్మక నిరసనలతో గుర్తింపు పొందిన టీఎల్పీపై ఇంటర్నెట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గాజాలో యుద్ధం ముగిసినట్లు వార్తలు వస్తున్న తరుణంలో ఈ అంశాన్ని లేవనెత్తడంపై పాక్లోని ఓ వర్గం విమర్శిస్తుంది. ఇక, నిరసన ప్రారంభం కావడానికి ముందే ప్రధాన రహదారులను దిగ్బంధించి ప్రభుత్వం అతిగా స్పందించిందని కొందరు ఆరోపించారు. ఓవైపు అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో హింసతో పాటు అంతర్గతంగా ఇటువంటి ఘటనలు పాక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
పాకిస్థాన్ డిప్యూటీ ఇంటీరియర్ మంత్రి తలాల్ చౌదరి ఇటీవల మాట్లాడుతూ.. టీఎల్పీ గాజాలో శాంతిని ఆశించడానికి బదులు హింసను ఎందుకు ఎంచుకుందో తనకు అర్థం కాలేదని అన్నారు. ఇస్లాంను అవమానిస్తే మరణదండన విధించే దైవ దూషణ చట్టాన్ని రక్షించాలన్న ఒకే అంశంతో 2018 పాకిస్థాన్ ఎన్నికల్లో టీఎల్పీ చేసిన ప్రచారం దానికి గుర్తింపు తీసుకొచ్చింది. అప్పటి నుంచి అది హింసాత్మక ర్యాలీలను నిర్వహిస్తోంది, ముఖ్యంగా విదేశాల్లో ఖురాన్ అవమానంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తూ నిరసనలు చేపడుతోంది. గత రెండేళ్ల కాలంలో లాహోర్, ఇతర పాక్ నగరాల్లో పాలస్తీనియన్లకు మద్దతుగా పలు ర్యాలీలు నిర్వహించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa