ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుమారుడికి తెలియకుండానే పలువురికి లాలూ సీట్లు,,,,తేజస్వీ యాదవ్ తీవ్ర అసహనం

national |  Suryaa Desk  | Published : Tue, Oct 14, 2025, 10:03 PM

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ మొదలైనా మహాఘటబంధన్ మద్య సీట్లు సర్దుబాటు ఇంకా కొలిక్కిరాలేదు. ఇండియా కూటమిలోని రాష్ట్రీయ జనతాదళ్ ( ఆర్జేడీ ), కాంగ్రెస్, వామపక్షాల మధ్య సీట్లపై సిగపట్లు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ఆర్జేడీ వ్యవస్థాకులు లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన పనికి కుమారుడు తేజస్వీ యాదవ్ ఖంగుతిన్నారు. తనకు నచ్చినవారికి లాలూ సోమవారం రాత్రి టిక్కెట్ కేటాయించేశారు. ఢిల్లీలో కోర్టు విచారణకు హాజరై అక్కడ నుంచి పట్నాకు వచ్చిన లాలూ నివాసానికి భారీగా పార్టీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. అధిష్ఠానం నుంచి ఫోన్ కాల్ అందుకున్న పలువురికి లాలూ బీ ఫార్మాలు ఇవ్వడంత వారి ముఖాలు వెలిగిపోయాయి. ఇలా సీట్లు దక్కినవారిలో ఇటీవలే జేడీయూకు రాజీనామా చేసిన ప్రముఖ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే సునీల్ సింగ్, మిటిహానీ మాజీ ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ సింగ్ అలియాస్ బోగో తదితరులు ఉన్నారు.


అయితే, తండ్రి చేసిన పనికి అసహనం వ్యక్తం చేసిన మహాఘటబంధన్ ఛైర్మన్ తేజస్వీ యాదవ్.. వెంటనే చర్యలు చేపట్టారు. హుటాహుటిన టిక్కెట్ పంపిణీ ఆపించి, లాలూ ఇచ్చిన బి-ఫామ్‌లను తిరిగి వెనక్కి ఇవ్వాలని కోరారు. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కిరానందున ఇలా టిక్కెట్ ఇవ్వడం సరికాదని తండ్రికి తేజస్వీ గట్టిగానే చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, భాగస్వామ్య పార్టీలను సంప్రదించకుండా లాలూ తన అనుయాయులకు టిక్కెట్లు పంపిణీ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఇలాగే వ్యవహరించారు. ఆర్జేడీలోని పలువురికి టిక్కెట్లు కేటాయించడంతో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి.


ఇండియా కూటమిలో సీట్ల పంపకాల గురించి మాట్లాడేందుకు ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో సోమవారం తేజస్వీ యాదవ్ భేటీ అయిన సమయంలో లాలూ ఘనకార్యం గురించి తెలిసి హుటాహుటిన ఆయన పట్నాకు వచ్చేశారు. అక్టోబరు 14న మంగళవారం రాత్రిలోగా ఏక్షణమైనా ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రెండు స్థానాల్లో పోటీచేయనున్న తేజస్వీ యాదవ్ బుధవారం రఘోపూర్‌లో నామినేషన్ వేయనున్నారు.


గత ఎన్నికల కంటే కాంగ్రెస్ పోటీచేసే స్థానాలు తగ్గనున్నట్టు తెలుస్తోంది. కిందటిసారి 70 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్ కేవలం 19 సీట్లలోనే విజయం సాధించింది. ఇక, 144 స్థానాల్లో పోటీచేసిన ఆర్జేడీ 75 చోట్ల గెలుపొంది, అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇక, ఎన్డీయే విషయానికి వస్తే ఇప్పటికే సీట్లు సర్దుబాటు కుదిరింది. బీజేపీ, జేడీ(యూ)లు చెరో 101 స్థానాల్లోనూ, లోక్‌ జనశక్తి 29, హిందూస్థాన్ అవామీ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా చెరో ఆరు స్థానాల్లో పోటీచేయనున్నాయి. బిహార్ అసెంబ్లీకి నవంబరు 6, నవంబరు 11న రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa