నెల్లూరు జిల్లా టీడీపీలో నేతల మధ్య నెలకొన్న వర్గ విభేదాలపై పార్టీ అధిష్ఠానం తీవ్రంగా స్పందించింది. నేతలు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు బహిరంగ విమర్శల స్థాయికి చేరడంతో, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రంగంలోకి దిగి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆయన ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు.కొంతకాలంగా కోటంరెడ్డి, వేమిరెడ్డి వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విలేకరుల సమావేశాలు నిర్వహిస్తూ బహిరంగంగా విమర్శలు చేసుకోవడం పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తోందని అధిష్ఠానం భావించింది. ఈ విషయం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో, తక్షణమే పరిస్థితిని చక్కదిద్దాలని ఆయన పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు.దీంతో పల్లా శ్రీనివాసరావు ఇద్దరు నేతలకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. వారిద్దరి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, తమ వ్యవహార శైలిని వెంటనే మార్చుకోవాలని స్పష్టం చేశారు. "పార్టీ క్రమశిక్షణను కాపాడటం ప్రతి కార్యకర్త, నాయకుడి ప్రాథమిక బాధ్యత. దానిని ఉల్లంఘించే వారిపై ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడం" అని పల్లా హెచ్చరించినట్లు సమాచారం. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకూడదని ఆయన ఇద్దరు నేతలకు గట్టిగా సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa