ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైవేపై 12 గంటల భారీ ట్రాఫిక్ జామ్.. రాత్రంతా స్కూల్ బస్సుల్లో చిక్కుకుపోయిన 500 మంది చిన్నపిల్లలు

national |  Suryaa Desk  | Published : Wed, Oct 15, 2025, 07:54 PM

మహారాష్ట్రలో మంగళవారం జరిగిన ఓ సంఘటన తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పాల్ఘర్ జిల్లాలోని ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 48)పై మంగళవారం సాయంత్రం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఆ హైవేపై ప్రయాణిస్తున్న వాహనాలు భారీగా చిక్కుకుపోయాయి. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ట్రాఫిక్ ముందుకు కదలకపోవడంతో.. తీవ్ర నరకయాతన అనుభవించారు. అయితే పిక్‌నిక్ కోసం వెళ్లిన స్కూల్ విద్యార్థులకు సంబంధించిన బస్సులు కూడా అందులోనే ఇరుక్కుపోవడంతో.. అందులోని చిన్నారులు నానా అవస్థలు పడ్డారు. తినడానికి తిండి లేక.. కనీసం తాగడానికి నీళ్లు కూడా లేకుండా రాత్రంతా ఇబ్బందులకు గురయ్యారు. 500 మందికి పైగా విద్యార్థులు.. దాదాపు 12 గంటల పాటు అవస్థలు పడ్డారు


థానే, ముంబై నగరాల్లోని పలు స్కూళ్లకు చెందిన 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు.. కొంతమంది కళాశాల విద్యార్థులు ఉన్న 12 బస్సులు.. ముంబై-అహ్మదాబాద్ హైవేపై వసాయ్ సమీపంలో మంగళవారం సాయంత్రం 5:30 గంటల నుంచి బుధవారం ఉదయం వరకు గంటల తరబడి నిలిచిపోయాయి.


దీంతో అందులో 500 మందికిపైగా స్టూడెంట్స్ చిక్కుకుపోయారు. విరార్ సమీపంలోని పిక్‌నిక్ నుంచి తిరిగి ఇళ్లకు వెళ్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. గంటల తరబడి ఆహారం, నీళ్లు లేకపోవడంతో వారి పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది. వసాయ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) పూర్ణిమ చౌగులే శ్రింగి వెల్లడించిన వివరాల ప్రకారం.. జాతీయ రహదారిపై వాహనాలు కొన్ని గంటల పాటు కనీసం ఒక్క అంగుళం కూడా కదలడానికి వీలు లేకుండా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయిందని తెలిపారు.


ఇక సాయంత్రం మొదలైన ట్రాఫిక్ రాత్రి అయ్యేసరికి మరింత తీవ్రం కావడంతో.. బస్సుల్లో ఉన్న చాలా మంది విద్యార్థులు ఆకలి, అలసటతో ఏడవటం ప్రారంభించారు. ఇక తమ పిల్లలు హైవేపై చిక్కుకుపోవడంతో వారి భద్రత గురించి వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అధికారులు హైవేపై ట్రాఫిక్ నిర్వహించడంలో పూర్తిగా విఫలం కావడంతో.. తమ పిల్లలు నరకం అనుభవించారని తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడ్డారు.


దీంతో స్థానికులు, సామాజిక సంస్థల సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని.. చిక్కుకుపోయిన పిల్లలకు తాగునీరు, బిస్కెట్లు పంపిణీ చేశారు. బస్సులను వీలైనంత త్వరగా ఆ ట్రాఫిక్ నుంచి బయటికి వచ్చేందుకు డ్రైవర్లకు వారు సహాయం చేశారు. చివరికి.. బుధవారం ఉదయం 6 గంటల కల్లా చిక్కుకుపోయిన బస్సులన్నీ తమ గమ్యస్థానాలకు చేరుకున్నాయి. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


ఈ భారీ ట్రాఫిక్ జామ్‌కు కారణం థానేలోని ఘోడ్‌బందర్ హైవేపై జరుగుతున్న మరమ్మతు పనులేనని అధికారులు వెల్లడించారు. ఆ హైవేపై నిర్మాణ పనుల కారణంగా భారీ వాహనాలను ముంబై-అహ్మదాబాద్ మార్గంలోకి మళ్లించడం వల్లే అధిక రద్దీ ఏర్పడిందని తెలిపారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa